మస్క్ మామా పెద్ద ప్లానే వేశాడుగా.. భారత్లో ఇంటర్నెట్ సేవల కోసం కీలక ఒప్పందం.
భారత్ లో ఇంటర్నెట్ సేవలను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దిశగా కీలక అడుగులు పడింది. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారత్ లోని మారుమూల గ్రామాలకు విస్తరించేందుకు జియోతో కీలక ఒప్పందం చేసుకుంది..

ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ.. రిలయన్స్ గ్రూప్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఇండియాలో అందుబాటులోకి వస్తాయి. అయితే, దీనికి లైసెన్స్ రావాల్సి ఉంది. జియో కాంపిటేటర్ ఎయిర్టెల్ కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుంది.
యూజర్లకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్ లింక్తో ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జియో కూడా ఇలాంటి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. దీంతో దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం హైస్పీడ్ ఇంటర్నెట్ అందించనున్నారు.
అయితే భారత్లో స్టార్లింక్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్ అనుమతులు పొందడంపై ఒప్పందం ఆధారపడి ఉంటుందని జియో తెలిపింది. జియో తన రిటైల్ అవుట్లెట్లు, ఆన్లైన్ వేదికగా స్టార్లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. క్లయింట్ సర్వీస్ ఇన్స్టాలేషన్, యాక్టివేషన్ కోసం జియో ఒక సిస్టమ్ను ఏర్పాటు చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా అన్ని ఇండియన్ కమ్యూనిటీలు, చిన్న, మధ్య తరహా సంస్థలు, వ్యాపారాలకు నమ్మకమైన ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.
స్టార్లింక్ ద్వారా జియో ఎయిర్ఫైబర్, జియోఫైబర్ మరింత వేగవంతమవుతాయి. మారుమూల ప్రదేశాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో నమ్మకమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి జియో తన డేటా ట్రాఫిక్ సామర్థ్యాన్ని, స్టార్లింక్ తన శాటిలైట్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటాయి.
ఈ ఒప్పందం గురించి జియో సీఈఓ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండే బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడమే జియో లక్ష్యం అన్నారు. స్పేస్ఎక్స్తో కలిసి స్టార్లింక్ను ఇండియాకు తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.

