సారాంశం

కరోనా నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను మ్యాచులు చూసేందుకు అనుమతి...

కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ సారా గిల్బర్ట్‌, ఆమె టీమ్‌కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన ప్రేక్షకులు...

టెన్నిస్ ఓ జెంటిల్మెన్ గేమ్. అందులోనూ ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీకి ఘనమైన చరిత్ర ఉంది. వింబుల్డన్ 2021 సీజన్‌లో ఓ అరుదైన సన్నివేశం, యావత్ ప్రపంచం మన్ననలు అందుకుంటోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను వింబుల్డన్ మ్యాచులు చూసేందుకు అనుమతించారు.

ఇందులో కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్‌, ఆమె టీమ్‌ కూడా ఉన్నారు. రాయల్ బాక్సులో కూర్చొని మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఈ శాస్త్రవేత్తలకు అరుదైన గౌరవం కల్పించింది వింబుల్డన్.

మ్యాచ్ ప్రారంభానికి ముందు సారా గిల్బర్ట్‌తో పాటు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేసిన నేషనల్ హెల్త్ సర్వీస్ టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది వింబుల్డన్. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతూ, లేచి నిలబడి గౌరవం ఇచ్చారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి నివాళిగా వింబుల్డన్ స్టేడియం బయట ‘థ్యాంక్యూ’ అనే రాశారు నిర్వాహకులు.