ఔట్ ఎలా ఇస్తారు..? కేన్ అసహనం
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఆటగాడు డార్లీ మిచెల్ ఔట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఆటగాడు డార్లీ మిచెల్ ఔట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దానిని ఔట్ గా పరిగణించడం పట్ల న్యూజిలాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇంతకీ మ్యాటరేంటంటే.. భారత బౌలర్ కృనాల్ పాండ్యా వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతి నేరుగా డార్లీ లెగ్ కి తగిలింది. దీనిపై భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా దానికి ఫీల్డ్ అంపైర్ సానుకూలంగా స్పందించి ఔట్గా ప్రకటించాడు. దీన్ని సవాల్ చేశాడు డార్లీ మిచెల్. అది ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యిందంటూ డీఆర్ఎస్ కోరాడు. అవతలివైపు క్రీజ్లో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మిచెల్కు మద్దతుగా నిలిచాడు.
అయితే థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించిన తర్వాత థర్డ్ అంపైర్ ఔట్గా ఇచ్చాడు. దాంతో మిచెల్తో పాటు విలియమ్సన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అది ఔట్ ఎలా ఇస్తారు? అంటూ ఫీల్డ్ అంపైర్ను ప్రశ్నించడంతో కాసేపు అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది కచ్చితంగా ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యిందంటూ వాదించిన మిచెల్ క్రీజ్ను వీడేందుకు ఇష్టపడలేదు.
దాంతో ఫీల్డ్ అంపైర్లు చర్చింకున్న తర్వాత థర్డ్ అంపైర్ను మరొకసారి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్పై స్పష్టత కోరారు. కాగా, థర్డ్ అంపైర్ మాత్రం తొలుత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎటువంటి ఇన్సైడ్ ఎడ్జ్ కాలేదంటూ వివరణ ఇచ్చాడు. అయితే హాట్స్పాట్లో మాత్రం బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అయినట్లు కనబడినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడంతో వివాదాస్పదమైంది. చివరకు చేసేది లేక డార్లీ మిచెల్ పెవిలియన్ కి చేరాడు.