మ్యాచ్ మధ్యలో కొరికిన ఆ రెజ్లర్.. సారీ చెప్పాడు..!
కాగా.. రవి దహియాను కొరికిన కజకిస్తాన్ క్రీడాకారుడు నురిస్లామ్.. తాజాగా క్షమాపణలు చెప్పడం గమనార్హం.
టోక్యో ఒలంపిక్స్ లో దేశానికి యువ రెజ్లర్ రవి దహియా రజత పతకం సాధించాడు. ఈ పతకం సాధించే క్రమంలో రవి దహియా చాలానే కష్టపడ్డాడు. ప్రత్యర్థి.. తన కండలు తెగిపడేలా పంటితో కొరుకుతూ గాయం చేస్తున్నా.. నొప్పిని పంటి బిగువున భరించాడే తప్ప.. వదిలేయలేదు. పోరాడి దేశానికి పతకం సాధించాడు.
కాగా.. రవి దహియాను కొరికిన కజకిస్తాన్ క్రీడాకారుడు నురిస్లామ్.. తాజాగా క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఈ ఇరువురు సెమీఫైనల్లో తలపడగా ఓటమి స్థితి నుంచి రవి పుంజుకొని విజయం దిశగా సాగుతుండగా ఎలా అదుపు చేయాలో తెలియక నురిస్లామ్ దహియా కుడి చేతిపై గట్టిగా కొరకడం తెలిసిందే.
అయితే, ఈ సంఘటనపై రవి తాజాగా స్పందిస్తూ నురిస్లామ్పై తనకెలాంటి కోపం లేదని చెప్పాడు. ‘ఫైనల్ బౌట్కు ముందు నేను వేదిక దగ్గరికి వెళ్లేసరికే నాకోసం నురిస్లామ్ ఎదురు చూస్తున్నాడు. అతడు నన్ను చూడగానే నా దగ్గరకి వచ్చి కరచాలనం చేసి జరిగిన తప్పును మన్నించాలని అడిగాడు. ఆ తర్వాత ఇరువురు ఆలింగనం చేసుకున్నాం. అయితే, ఇప్పటికి అతడు కొరికిన దగ్గర నొప్పిగానే ఉంది. అయినా రెజ్లింగ్లో ఇలాంటివి సాధారణమే. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తుంటాం’ అని రవి తెలిపాడు.
జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్ని త్యాగం చేయడం తప్పనిసరి అని రవి అభిప్రాయపడ్డాడు. ఒలింపిక్స్ మెడల్ను దృష్టిలో పెట్టుకొని తాను రెండు నెలల నుంచి తల్లిదండ్రులతో మాట్లాడం మానేశానని రవి చెప్పాడు. తన తండ్రి ఒక సాధారణ రైతు అని..రెజ్లింగ్లో తాను రాణించడానికి ఆయన చాలా కష్టపడ్డారని చెప్పాడు. ఇప్పటినుంచి ఆయనకు ఏ కష్టం తెలియకుండా సంతోషంగా చూసుకుంటానని చెప్పాడు.