తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన భారత వెయిట్లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకంతో మెరిసింది. మహిళల 53 కేజీల విభాగంలో నైజీరియా లిఫ్టర్ ఒనోమ్ ఒమోలోలా దిదిహ్తో హోరాహోరీగా తలపడి పలు రికార్డులు బద్దలు కొట్టింది. చివరికి 199 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.
భారత వెయిట్లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ తన తొలి కామన్వెల్త్ గేమ్స్లోనే అద్భుత ప్రదర్శన చేసింది. సోమవారం గ్లాస్గోలో జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుంది. స్వర్ణం గెలిచిన నైజీరియా లిఫ్టర్ ఒనోమ్ ఒమోలోలా దిదిహ్తో చివరి వరకు హోరాహోరీగా పోరాడింది.
ఈ పతకంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. వీటిలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. ఛత్తీస్గఢ్కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి ఈ పోటీలో అసాధారణమైన పట్టుదల, ఏకాగ్రత కనబరిచింది. స్వర్ణ పతకం కోసం జరిగిన ఈ పోరులో ఆమె తన శక్తికి మించి రాణించి, కొన్ని రికార్డులను కూడా నెలకొల్పింది.
రికార్డులతో హోరాహోరీ పోరు
స్నాచ్ రౌండ్లో జ్ఞానేశ్వరి తన ప్రస్థానాన్ని 82 కేజీల బరువుతో ప్రారంభించింది. రెండో ప్రయత్నంలో 85 కేజీలు ఎత్తింది. ఆ తర్వాత మూడో ప్రయత్నంలో ఏకంగా 88 కేజీల బరువును విజయవంతంగా ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సృష్టించింది. దీంతో ప్రత్యర్థి దిదిహ్పై ఒత్తిడి పెంచింది. అయితే నైజీరియా లిఫ్టర్ ఏమాత్రం తగ్గకుండా 93 కేజీలు ఎత్తి ఆ రికార్డును బద్దలు కొట్టింది. దీంతో క్లీన్ అండ్ జర్క్ రౌండ్కు ముందు ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక క్లీన్ అండ్ జర్క్ రౌండ్లో స్వర్ణ పతకం కోసం ఇద్దరు యువ అథ్లెట్ల మధ్య పోరు మరింత ఉత్కంఠగా సాగింది. జ్ఞానేశ్వరి ఈ రౌండ్ను 103 కేజీల బరువుతో ప్రారంభించి, తన మొత్తం స్కోరును 191 కేజీలకు పెంచుకుంది. ఇది కూడా మరో రికార్డు. ఆ తర్వాత 107 కేజీలు ఎత్తి, ఆ రికార్డును మరింత మెరుగుపరిచింది. స్వర్ణం అందుకోవాలనే పట్టుదలతో తన చివరి ప్రయత్నంలో 111 కేజీల బరువును విజయవంతంగా ఎత్తింది. దీంతో ఆమె మొత్తం 199 కేజీలతో మరో గేమ్స్, కామన్వెల్త్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
నైజీరియా లిఫ్టర్ దిదిహ్ అద్భుతంగా పుంజుకుని 113 కేజీలు ఎత్తింది. మొత్తం 206 కేజీలతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కెనడాకు చెందిన రెబెకా గ్రౌల్క్స్ 178 కేజీలతో కాంస్య పతకం గెలుచుకుంది.
కెరీర్లో కీలక మైలురాయి
స్వర్ణ పతకం తృటిలో చేజారినప్పటికీ జ్ఞానేశ్వరి సాధించిన ఈ రజతం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. నిజానికి ఈ ఛత్తీస్గఢ్ అథ్లెట్ ఇంతకుముందు 49 కేజీల విభాగంలో పోటీపడేది. కానీ అదే కేటగిరీలో మన ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను ఉండటంతో, ఆమెతో పోటీని ఎదుర్కోవడం సవాలుగా భావించి 53 కేజీల విభాగానికి మారింది.


