కోవిడ్ తరువాత క్రీడలకు దిశా నిర్దేశం
కోవిడ్-19 సమయంలో తీసుకున్న చర్యలపై సమీక్షించడంతోపాటు రాష్ట్రస్థాయిలో క్రీడా కార్యకలాపాలను పున్ణప్రారంభించడం, రాష్ట్రాలు, యూటీల్లో బ్లాక్, జిల్లాస్థాయిల్లో పోటీల ద్వారా వర్ధమాన క్రీడా ప్రతిభను గుర్తించడంపై చర్చించనున్నారు.
క్రీడల పునరుద్ధరణకు భవిష్యత్ రోడ్మ్యాప్పై దృష్టి పెట్టాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు రాష్ట్ర, కేంద్రపాలిత క్రీడామంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కోరారు. కరోనా వైరస్ కారణంగా క్రీడారంగాన్ని గాడిలో పెట్టాలని మంగళవారం నిర్వహించిన 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా మంత్రులు, సీనియర్ అధికారులను ఆదేశించారు.
మంగళ, బుధవారాల్లో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో రిజిజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రులతో సమావేశమవుతారని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా అట్టడుగుస్థాయినుంచి క్రీడా అభివద్ధికి, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్(ఎన్వైకేఎస్), నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) కార్యకలాపాలకు రోడ్మ్యాప్ను రూపొందించాలని ఈ సమావేశ లక్ష్యంగా నిర్వహించారు.
అలాగే, కోవిడ్-19 సమయంలో తీసుకున్న చర్యలపై సమీక్షించడంతోపాటు రాష్ట్రస్థాయిలో క్రీడా కార్యకలాపాలను పున్ణప్రారంభించడం, రాష్ట్రాలు, యూటీల్లో బ్లాక్, జిల్లాస్థాయిల్లో పోటీల ద్వారా వర్ధమాన క్రీడా ప్రతిభను గుర్తించడంపై చర్చించనున్నారు.
దేశంలోని అన్ని పాఠశాల పాఠ్యాంశాల్లో భాగంగా ఫిట్నెస్, క్రీడలను చేర్చడంపై ఇందులో నిర్ణయం తీసుకుంటారు. 2028లో ఒలింపిక్ పోడియంలో టాప్-10 చోటు దక్కించుకోవాలంటే దేశంలో క్రీడలను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడం చాలా కీలకమని రిజిజు నొక్కిచెప్పారు. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(కేఐఎస్సిఇ)ని అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఏర్పాటుకు క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని రిజిజు పేర్కొన్నారు.