Asianet News TeluguAsianet News Telugu

భస్మధారణ ఎందుకో తెలుసా

విభూతి ధారణ చేయటం వలన సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరును, మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుజ్ఞాన జ్యోతి వెలుగొందును.

what is Bhasmaradhana
Author
Hyderabad, First Published Jan 25, 2021, 11:32 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

what is Bhasmaradhana

విభూతి మంత్రం:-
            భూతిర్భూతి కరీ, పవిత్ర జననీ, పాపౌఘ విధ్వంసినీ 
            సర్వోపద్రవ నాశనీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ 
            భూత ప్రేత పిశాచ రాక్షస గణాధ్యక్షాది సంహారిణీ 
            తేజోరాజ్య విశేష మోక్షకరీ భూతి స్సదాధార్యతాం 

విభూతి ధారణా సమయ మందు:-

            శ్రీకరంచ పవిత్రంచ శోక మోహ వినాశనం
            ధరామి భసితం దివ్యం తేజః కాంతిం ప్రయచ్ఛతు

భావం: విభూతి ధారణ చేయటం వలన సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరును, మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుజ్ఞాన జ్యోతి వెలుగొందును.

అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ
సర్వగ్‍ంహవాఇదం భస్మ వాఙ్మన ఇత్యేతాని చక్షూగ్‍ంషి కరణాని భస్మాని

దీనితో పాటే శ్రీరుద్రంలోని "త్రయంబకం యజామహే..." కూడా చదివడం మంచిది.

అలాగే తైత్తరీయ సంహితలోని:-

            "త్రియాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రియాయుషమ్ అగస్త్య త్రియాయుషమ్
            యద్దేవానాం త్రియాయుషమ్ తన్మే అస్తు త్రియాయుషమ్" కూడా పఠించవచ్చు.


అనేక లాభాలను చేకూర్చేది విభూతి, అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి. ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా ప్రీతికరమైంది.

హోమగుండంలో హోమం చేసినప్పుడు ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు. హోమగుండం, ధుని - రెండూ పరమ పవిత్రమైనవి.హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు , పిడకలు , రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు , నవధాన్యాలు , గంధపుచెక్కలు, నేరేడు , సాంబ్రాణి , ఆవునెయ్యి , సాంబ్రాణి , అగరొత్తులు  వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి.

            శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం
            లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం

పరమ పవిత్రమైనది, అనారోగ్యాలను పోగొట్టేది, సంపదలను చేకూర్చేది, బాధలను నివారించేది, అందరినీ వశంలో ఉంచుకునేది అయిన విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అనేది ఈ శ్లోక భావం.

కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం.

            "భస్మనా సజలే నైనధారయేచ్చత్రిపుండ్రకం"

అంటూ గృహస్తు భస్మాన్ని నీళ్ళతో తడిపి నుదుటిమీద, ఉదరంపైన, చేతులమీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకానివారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే కనీసం "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి భస్మధారణ చేయాలి.

స్త్రీలు, స్వాములు నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. "ప్రయోగ పారిజాతం"లో కూడా ఇదే సంగతి రాశారు. ఇతర ఏ వస్తువు లేదా పదార్ధాన్ని అయినా కాలిస్తే బూడిదగా మారుతుంది. కానీ బూడిదను కాలిస్తే రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు ఆరోగ్యదాయిని కూడా.

విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది. విభూతి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాల నుండి విభూతి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం.

విభూతి మహిమ:- సకల దోషాలు తొలగి, సర్వపాపాలూ పటాపంచలు కావాలన్నా, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభించాలన్నా ప్రతిరోజూ విభూతిని ధరించడమే ఏకైక మార్గమని శాస్తవ్రచనం. రోజూ పూజలు చేయలేనివారు, ఆలయ సందర్శన చేయలేనివారు ప్రతినిత్యం నుదుటన విభూది ధరిస్తే చాలు సహస్ర నామాలతో స్వామిని పూజించి, నిత్యం ఆలయదర్శనం చేసుకుంటున్నంత ఫలాన్ని పొందుతారు. అంతటి శక్తిమంతమైన విభూతిని ధరించిన వారి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుందని పురాణ కథనం

మృత్యుంజయ మంత్రం:-

            ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
            ఉర్వారుక మివబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్

విభూతి అంటే ధనము, బలము, మహిమ, లీల, మహాత్మ్యం అనే అర్థాలున్నాయి. విభూతి ధరిస్తే సకల శారీరక, మానసిక రోగాలు తొలగిపోయి, పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

పవిత్రమైన విభూతిని ఎలా ధరించాలో ఏ అంగాలలో ధరిస్తే ఏయే ఫలితాలు సిద్ధిస్తాయో చూద్దాం. ఫాలభాగం- పీకలవరకు చేసిన పాపాలు తొలగుతాయి. వక్షస్థలం - మనస్సుతో తెలిసి చేసిన పాపం నశిస్తుంది. నాభి - కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది. భుజాలు - చేతితో చేసిన పాపం నశిస్తుంది. మోకాళ్లు - కాళ్లతో చేసిన పాపం పరిహరింపబడుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios