Asianet News TeluguAsianet News Telugu

బొడ్డెమ్మ ప్రాంతాల వారిగా

బొడ్డెమ్మ పండగ అనేది ప్రాంతాల వారిగా కొన్ని కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి ప్రారంభిస్తే ఇంకొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. 

The Significance of Boddemma
Author
Hyderabad, First Published Oct 1, 2021, 1:37 PM IST

 


            బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో
            నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో
            చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలో
            కాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలో

బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరి మల్లె చెట్టును నాటిందట. దానికి కాయలు పిందెలు కాసాయట. ఈ పాటను ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రీతుల్లో పాడుతుంటారు. శివుని భార్యయైన గౌరమ్మను తమ ఆడ బిడ్డగా భావిస్తూ...  ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు. 

బొడ్డెమ్మ పండగ అనేది ప్రాంతాల వారిగా కొన్ని కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి ప్రారంభిస్తే ఇంకొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంబమై ఈ తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి, ఆడి పాడి తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు. మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటరు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బొడ్డెమ్మను నాలుగు రకాలుగా తయారుచేస్తారు.

'బొడ్డెమ్మ' అనే పేరుకు 'బొట్టె', బొడిప', పొట్టి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. 'బొడ్డ' అనే పదానికి 'అత్తిచెట్టు' అనే మరో అర్థం కూడా ఉంది. దీన్నే మేడిచెట్టు, ఉదంబర చెట్టు అని పిలుస్తారు. సాధారణంగా సంతానం కలగాలని, వివాహం కుదరాలని ఉదంబరాన్ని పూజిస్తుంటారు. ఆపరంగా ప్రకృతిని కూర్చి ఈ ఉదంబర / మేడి పూజనే  'బొడ్డపూజ' గా మారి ప్రచారం పొందిందని అనుకోవచ్చు. బొడ్డెమ్మ ఆటపాటలను 'గర్భో' నృత్యంతో పోల్చవచ్చు. 'గర్భో' అంటే 'గొబ్బి' అని ఒక అభివూపాయం. గొబ్బిరీతిలో బొడ్డెమ్మ కూడా కన్నెపిల్లలు, పిల్లలతో పూజలందుకుంటుంది. గిరిజనులు నిర్వహించే పండగలలో 'కన్నెపిల్లలు, బాలికలు ఎంతో సంబురంగా తమ పెళ్లి ఘనంగా, మంచిగా జరగాలని కొలిచే పండగ 'థీజ్ పండగ'. ఈ పండగను కూడా 9 రోజులు (ఇంచుమించు) కన్నెలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు సాయంకాలం ఆడి పాడుతుంటారు. థీజ్ పండగకు బొడ్డెమ్మ, బతుకమ్మ పండగలకు కూడా పోలిక ఉందని చెప్పవచ్చు.

బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా ప్రాంతాల వారిగా తయారు చేస్తారు అవి 

1. పీట బొడ్డెమ్మ 
2. గుంట బొడ్డెమ్మ 
3. పందిరి బొడ్డెమ్మ 
4. బాయ బొడ్డెమ్మ

పీట బొడ్డెమ్మ చెక్కపీటపై పుట్టమన్నును ఐదు దొంతర్లుగా వేస్తూ పైన కలశాన్ని పెట్టడం 'పీట బొడ్డెమ్మ' ప్రత్యేకత. పీట బొడ్డెమ్మ పీట బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చేస్తారు. పుట్టమన్నుతో ఐదు దొంతరులుగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి వేస్తారు. దొంతర్లలో అడుగున ఉన్నది పెద్దదిగా మిగిలినవి చిన్నవిగా వరుసకమంలో ఉంటాయి. దీని చుట్టూ మళ్ళీ ఐదు పెడుతారు. గిన్నెలో బియ్యం పోసి పసుపు ముద్ద గౌరమ్మను అందులో పెట్టి పసుపు కుంకుమ అలంకరిస్తారు. ఆ గిన్నెను బొడ్డెమ్మ శిఖరభాగాన ఉంచుతారు. ఈ విధంగా చేసిన బొడ్డెమ్మ చుట్టు తిరుగుతూ సాయంకాలం వేళ ఆట ఆడి దేవుని ముందు పెడతారు. చివరిరోజు పీట మీద నుండి బొడ్డెమ్మను తొలగించి నీటిలో నిమజ్జనం చేస్తారు.

గుంట బొడ్డెమ్మ గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను 'గుంట బొడ్డెమ్మ' అంటారు. మనిషి అడుగు పడని చోట ఒక గుంటను తవ్వి దాని చుట్టూరా ఐదు చిన్న గుంతలను తవ్వుతారు. ఈ గుంతలన్నింటినీ పూలతో అలంకరిస్తారు. ప్రతి మధ్య గుంటలోని పూలను తీయకుండా చిన్న గుంటల్లోని పూలను మాత్రం తీసి ఒక పాత్రలో పెట్టి నీటిలో వేస్తారు. దీనినే 'అంపుట' అంటారు.

పందిరి బొడ్డెమ్మ పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేస్తారు. ఇంటి ముందు చిన్న పందిరి వేసి దాన్ని సీతాఫలం ఆకులతో కప్పుతారు. ఆ పందిరి క్రింద పేడతో అలికి ముగ్గులు వేస్తారు. పందిరి మధ్య నుండి ఒక సీతాఫలాన్ని, ఒక మొక్కజొన్న కంకిని దారాలతో కట్టి కిందికి వేలాడదీస్తారు. వాటి కింద ముగ్గుల మధ్య బొడ్డెమ్మను అలంకరించి పెడతరు. కొన్ని పూలు చల్లి పసుపు గౌరమ్మను బొడ్డెమ్మ పక్కన అమర్చుతారు. ఆ విధంగా పందిరి కింద నిలుపు కోవడం వలన దీన్ని 'పందిరి బొడ్డెమ్మ' అని పిలుస్తారు. ఈ పందిరి బొడ్డెమ్మను పూజించి, ఆడి పాడి తొమ్మిదవ రోజున నిమజ్జనం చేస్తారు.

బాయి బొడ్డెమ్మ బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను 'బాయి బొడ్డెమ్మ' అని అంటారు. బావిలాగా ఒక చిన్న గొయ్యిని తవ్వి మట్టిని తీసి అదే మట్టితో ముద్దలు చేస్తారు. నాలుగు ముద్దల చొప్పున బావికి నాలుగు వైపుల పెడతారు. ఆ బావి మధ్య ఒక వెంపలి చెట్టును నాటుతారు. చుట్టూ ఉన్న గద్దెలపై పువ్వులు వేసి పూజిస్తారు. చివరిరోజు ఈ పూలన్నింటినీ నీటిలో నిమజ్జనం చేస్తారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios