Asianet News TeluguAsianet News Telugu

పుష్కరం అంటే ఏమిటీ.. పుష్కర స్నానానికి ఎందుకంత ప్రధాన్యత ఉంది..

pushkaram: ఈ భూమ్మిదున్న ప్రతిజీవి మనకుగడుకు జీవనాధారం నీరు. ఈ జలం పుట్టిన తర్వాతనే జీవకోటి ఉద్భవించింది. కాగా పుష్కరాల్లో స్నానాలు ఆచరించడం వల్ల శారీరక రుగ్మతలు నశిస్తాయి. అంతేకాదు నదీస్నానాల వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలుపుతున్నాయి.
 

The importance of pushkaram
Author
Hyderabad, First Published Apr 13, 2022, 12:36 PM IST

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది. జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు,మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు) మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే. నదీతీరంలో పితృకర్మలు ఆచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి.

తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలం నుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం , అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది. ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయా నదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.

నది - రాశి

1) గంగానది - మేషరాశి

2) రేవానది (నర్మదానది ) - వృషభరాశి

3) సరస్వతీ నది - మిథునరాశి

4) యమునా నది - కర్కాటరాశి

5) గోదావరినది - సింహరాశి

6) కృష్ణానది - కన్యారాశి

7) కావేరీనది - తులారాశి

8) భీమానది - వృశ్చికరాశి

9) పుష్కరవాహిని / రాధ్యసాగనది - ధనుస్సురాశి

10) తుంగభద్రనది - మకరరాశి

11) సింధునది - కుంభరాశి

12) ప్రాణహిత (ప్రణీత)నది - మీనరాశి

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంత కాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

ప్రాణహిత పుష్కరాలు
ప్రణీతావరదావైన్యా గౌతమీచ సరస్వతీ
నద్యః పంచ వహంత్యత్ర ప్రయాగా త్కోటిశోధికం!!

ప్రాణహితానది, వైన్య, వరద, సరస్వతీ నదులు గోదావరిలో సంగమించే క్షేత్రంలో స్నానమాచరిస్తే... త్రివేణి సంగమ క్షేత్రమైన అలహాబాదు (ప్రయాగ)లో స్నానం చేసిన దానికంటే కోటిరెట్లు అధికమైన ఫలం లభిస్తుందని స్కంధపురాణంలోని కాళేశ్వర ఖండం చెబుతుంది. అంతటి ప్రత్యేకత గల క్షేత్రం మన కరీంనగర్‌ జిల్లాలోని కాళేశ్వరం.

పవిత్ర జీవనదీమతల్లిగా గుర్తింపు పొంది అధిక భాగం తెలుగు నేలలో ప్రవహిస్తున్న గోదావరి నదికి ప్రధాన ఉపనది ప్రాణహిత (ప్రణీత) నది. సహ్యాద్రి పర్వత శ్రేణులు ప్రాణహిత జన్మస్థలం. మహారాష్ట్రలోని అహెరి వద్ద పెన్‌గంగా నది వేయిన్‌ గంగాతో కలుస్తుంది. మరోవైపు వేయిన్‌ గంగా, వరదా నదీ ప్రవాహంతో కలిసి ప్రాణహిత నదిగా రూపుదిద్దుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల గుండా 130 కి.మీ.లు ప్రవహంచి కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో సంగమిస్తుంది. ఎగువన నిర్మిస్తున్న ఆనకట్టలతో వర్షాకాలంలోనూ గోదావరమ్మ ఎండిపోతోంది. ఈ తల్లిని జీవనదిగా నిలిపేందుకు.. కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమించే ప్రాణహిత గోదారమ్మకు అండదండనిచ్చి ఎన్నటికీ ఎండిపోకుండా జలసిరులు పొంగిస్తూ తన పేరును సార్థకం చేసుకుంటుంది.

పుష్కర ప్రాశస్త్యం:- పురాణ గాథల ప్రకారం... పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం ఘోర తపమాచరించాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అందుకు పుష్కరుడు... జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమవుతున్నాయనీ నదులు పునీతమైతే దేశం సుభిక్షంగా ఉంటుందనీ ఆలోచించి 'దేవా... నా శరీర స్పర్శచే సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడట. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాపవిముక్తులవుతారు' అని వరమిచ్చాడట.

పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు (బృహస్పతి) తనకూ పుష్కరత్వం ప్రసాదించమని బ్రహ్మను గురించి తపమాచరించగా అందుకు పుష్కరుడు అంగీకరించలేదు. పుష్కర, బృహస్పతులిద్దరికీ నచ్చజెప్పిన బ్రహ్మ వారిద్దరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాడట. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలు గానూ చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగానూ వ్యవహరించి పుష్కర వేడుకలు నిర్వహిస్తారు.


 ఉదాహరణకు గురుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగ పుష్కరాలు నిర్వహిస్తారు. అలాగే వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మద, మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీనది పుష్కరాలు... ఇదే కోవలో మీనరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేవే ప్రాణహిత పుష్కరాలు. ఆ సమయంలో బ్రహ్మాదిదేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు కాబట్టి ఆయా నదుల్లో స్నానాలాచరించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ... అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ భక్తుల విశ్వాసం.

కాళేశ్వర క్షేత్రం :- కరీంనగర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలంలో జిల్లా కేంద్రానికి 140 కి.మీ.ల దూరంలో ఉంది కాళేశ్వర క్షేత్రం. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ(అంతర్వాహిని) నదులు కలిసే ప్రాంతం కావడంతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి కెక్కింది. త్రివేణి సంగమంలో కలిసే పెన్‌గంగ, వరదా నదులను కలిపి పంచగంగ అంటారు. కాళేశ్వర, ముక్తీశ్వర లింగాలుగా శివుడు ఇక్కడ ఒకే పానవట్టంపై కొలువుండటం విశేషం. ఇందులో ముక్తీశ్వరుని లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉండి.. వాటిలో ఎన్ని నీళ్లు పోసినా కనిపించకుండా పోవడం ఇక్కడి మరో ప్రత్యేకత. ప్రధాన దేవాలయానికి ఆగ్నేయ భాగంలో యమకోణం ఉంది. ఈ యమకోణం ముందు తలవంచి పడమర నుంచి తూర్పునకు దక్షిణం నుంచి ఉత్తరం వైపూ దూరి బయటకు వస్తే పాపాలన్నీ పరిహారమవుతాయని భక్తుల నమ్మకం.

అసలు ఎవరు ఈ పుష్కరుడు:- పూర్వం తుందిలుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన తన తపస్సుతో పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపచేసుకోగా, ఆ పరమాత్మ వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందిల మహర్షి నీలో నన్ను లీనం చేసుకో అని వరం కోరుకోగా ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలంలో తుందిలుడిని లీనం చేసుకున్నాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన తుందిల మహర్షి మూడున్నర కోట్ల తీర్ధాలకూ ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు.

సృష్టి మనుగడకు నీరే ఆధారం. కానీ జల సంపత్తి అంతా తుందిల మహర్షి ఆధీనంలో ఉండిపోవడంతో ఆ సృష్టి కర్త అయిన బ్రహ్మ శివుడిని ప్రార్ధించి, పుష్కరుడిని తన కమండలంలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇదిలా ఉండగా బృహస్పతి (గురు గ్రహం) లోకాన్ని కాపాడడం కోసం తనకు పుష్కర స్పర్శ కావాలనుకున్నాడు. అందుకోసం  జలాన్ని ఇవ్వాల్సిందిగా బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలి వెళ్ళనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. 

మేషాది రాశుల్లో బృహస్పతి ప్రవేశించినప్పుడు మొదటి మరియు చివరి పన్నెండు రోజులూ పూర్తిగాను, మిగిలిన సంవత్సరం అంతా మధ్యాహ్న కాలంలో రెండు ముహూర్తాల కాలం పాటు పుష్కరుడు ఆ నదీ జలాల్లో ఉండేలాగా ఒప్పదం. పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలు కూడా ఆ నదీజలంలో ఆవాహన అయ్యి ఉంటారు. అందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది. శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

పుష్కర స్నానం ఎలా చెయ్యాలి :- 

పుష్కర స్నానానికి నదిలో దిగేముందు చెప్పవలసిన శ్లోకం:-

పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ 

మృత్తికాం తే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయా  

( స్త్రీలయితే 'మృత్తికాం' అని ఉన్న చోట 'హరిద్రాం' అని చదువుకోవాలి )

ముందుగా ఈ శ్లోకం చదువుతూ గట్టు మీద ఉన్న మట్టిని ( స్త్రీలయితే మట్టికి బదులు పసుపు, కుంకుమ ) కొద్ది కొద్దిగా మూడు సార్లు నదిలో వేసి, ఆ తరువాతనే నదిలోకి దిగాలని శాస్త్ర వచనం. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదట. దీని వెనుక ఒక పురాణ గాధ ఉన్నది.

పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒక రోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ, ఆ చెట్టు పండ్లు తింటూ, అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి, చలించి పోయిన నారద మహర్షి  'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి, ఆ నామం నీ జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. 

ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి అతను సాధించిన తపోశక్తికి అభినందిస్తాడు. పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని అడగగా శనిదేవుడే అందుకు కారణమని చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెప్పగా, శాంతించి, శనిదేవుడిని తిరిగి గ్రహ మండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వారికి శని సంబంధమైన దోషాలు, బాధలు ఉండవని వరాన్ని ప్రసాదించాడు. 

తరువాత పిప్పలాద మహర్షి యజ్ఞం చేయగా, ఆ యజ్ఞ కుండం లోంచి కృత్య అనే రాక్షస భూతం ఉద్భవించింది. ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని, మునులని తినబోగా, వెంటనే పరమ శివుడు కల్పించుకుని, నిన్ను తలచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అని ఆఙ్ఞాపించాడట. అందుకే పుణ్య నదీ స్నానాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకున్న తరువాతనే స్నానం చెయ్యాలి. ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి. భక్తిగా మూడు మునకలు వేసినా సరిపోతుంది. కానీ సబ్బులు, షాంపూలతో మాత్రం నదీ స్నానం చెయ్యకూడదు.

పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన.. వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం.  పిండ ప్రదానం వలన... అశ్వమేధ యాగ ఫలము. మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితము లభిస్తుందని శాస్త్ర వచనం. 

దానాలు:- పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. పుష్కర 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దానానికి ప్రసిద్ధి. 

మొదటి రోజు: భూ దానం, ధాన్య దానం, సువర్ణ దానం, రజత దానం, అన్న దానం

రెండవ రోజు: రత్న దానం, గో దానం, లవణ దానం, వస్త్ర దానం

మూడవ రోజు: గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం (పండ్లు)

నాలుగవ రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె

ఐదవ రోజు: ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు 

ఆరవ రోజు: ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం 

ఏడవ రోజు: గృహ దానం, మంచం, కుర్చీ, పీట లాంటి గృహోపకరణ వస్తువులు 

ఎనిమిదవ రోజు: చందనం, కంద మూలాలు, పుష్ప మాలలు 

తొమ్మిదవ రోజు: కంబళ్ళు, దుప్పట్లు, పిండ దానం, దాసీ దానం 

పదవ రోజు: శాకం (కూరగాయలు) దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం 

పదకొండవ రోజు: గజ దానం 

పన్నెండవ రోజు: నువ్వుల దానం 

పిండ ప్రదానాది కార్యక్రమాలు:-

పుష్కర తీర్ధంలో పిండ ప్రదానం చేస్తే, సమస్త నదీ తీరాల్లో పిండ ప్రదానం చేసినట్లే.. అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా సూర్యోదయానికి పూర్వం చేసే పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా మన ఖాతాలో వేసుకున్నట్లే. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని శాస్త్ర వచనం. సూర్యాస్తమయ వేళలో మాత్రం పుష్కర తీర్ధంలో ఎలాంటి క్రతువులు నిర్వహించరాదు.

తీర్ధ స్నానం ఉత్తమం. దానికంటే నదీ స్నానం ఉత్తమం. దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం, బ్రహ్మము నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు ఉద్భవించాయి.

నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. ఇలాంటి మహత్తు ఉన్నందుకే పుష్కర స్నానానికి అంత ప్రాధాన్యత.

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios