Asianet News TeluguAsianet News Telugu

విపత్తుల నుండి రక్షించే మహామంత్రం

ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును

The great mantra of protection from disasters
Author
Hyderabad, First Published Jun 16, 2021, 3:01 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12) లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59 వ సూత్రంలో 12 వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60) లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము.

మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. 

ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. 

            "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
            ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"

దీనికి అర్థం అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమశివుడిని మేము పూజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా అని అర్ధం. ఈ మంత్రాన్ని సాధారణంగా ముమ్మారు గాని, 9 మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.  

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమికొడతాయి. ఈ మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. 

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో 3 కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను 3 మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభిస్తుంది.ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు.

మహా మృత్యుంజయ మంత్ర పద తాత్పర్యాలు:- ఓం భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మ అనే అక్షరాల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి 'అ'కారం, యజుర్వేదం నుండి 'ఉ'కారం, సామవేదం నుండి 'మ' కారం పుట్టాయి. ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది.

త్య్రంబకం భూత, భవిష్యత, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్య్రంబకమంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలోనున్న సూక్ష్మరూప నేత్రం మూడవనేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి.

యజామహే అంటే ధ్యానిస్తున్నానని అర్థం సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి.

సుగంధిం సు - మంచిదైన, గంధ - సువానసన ద్రవ్యం. మంచి వాసనలతో కూడుకొన్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు ఆ స్వామి మనపై తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు.

పుష్టివర్ధనం మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొనియున్నాడు. సృష్టి యావత్తూ ఆయన అధీనంలో ఉంది. ఉర్వారుకం ఇవ బంధనం దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కించుతాడు. మృత్యోర్ముక్షీయ అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మృత్యువు నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే.

అమృతాత్ స్వామి అల్ప సంతోషి. సులభప్రసన్నుడు

ప్రయోజనం:- చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగంతో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని తీగనుంచి దోసకాయను దూరం చేసినట్లు దూరంచేస్తాడు.


 

Follow Us:
Download App:
  • android
  • ios