ఆయన తలను శివుడు తొలగించడం ఆ తర్వాత పార్వతీ దేవి కోరిక మేరకు.. మళ్లీ పునర్జన్మ ప్రసాదించి.. ఏనుగు తల అమర్చడం ఈ కథంతా మనకు తెలిసిందే. 

వినాయకుడు.. ఈ పేరు తలుచుకోగానే మనకు.. ఏనుగు ముఖం, భారీ శరీరం అనే రూపం గుర్తుకువస్తుంది. వినాయకుడిని ప్రజలు ఈ రూపంలోనే పూజిస్తారు. కానీ... ఒక గుడిలో మాత్రం.. ఆయనను గజముఖ వినాయకుడిగా కాకుండా... మనిషి ముఖంతో పూజిస్తారు. ఈ ఆలయం తమిళనాడులో ఉంది. నరముఖ గణేషుని ఏకైక ఆలయం ఇది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అవును, వినాయకుడిని మానవ ముఖంతో ఊహించడం కష్టం. ఈ ఆలయంలో అలానే పూజిస్తారు. వినాయక స్వామి పుట్టుకతోనే ఏనుగు తలతో పుట్టలేదు. నర రూపంలోనే జన్మించారు. కానీ ఆయన తలను శివుడు తొలగించడం ఆ తర్వాత పార్వతీ దేవి కోరిక మేరకు.. మళ్లీ పునర్జన్మ ప్రసాదించి.. ఏనుగు తల అమర్చడం ఈ కథంతా మనకు తెలిసిందే. ఏనుగు తల పెట్టకముందు వినాయకుడు ఏ రూపంలో ఉన్నాడో.. అలా ఈ ఆలయంలో స్వామి వారు దర్శనమిస్తారు.

నరముఖ గణేశ...

నరముఖ గణేశ తమిళనాడులోని తిలతర్పన్‌పురి సమీపంలోని ముక్తేశ్వర ఆలయంలో ఉంది. దీనిని ఆది వినాయక దేవాలయం అని కూడా అంటారు. మానవుని ముఖం కారణంగా ఈ ఆది వినాయకుని దివ్య రూపాన్ని 'నర ముఖ' వినాయకుడు అని కూడా అంటారు. ఇది గణేశుడి దివ్య రూపం. ప్రసిద్ధ గజాననుడి అరుదైన రూపాన్ని కలిగి ఉన్న ఏకైక ఆలయం.

పురాణాల ప్రకారం, రాముడు దశరథ రాజుకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో.. అతను ప్రార్థన చేసిన ప్రతిసారీ, అతని ముందు ఉంచిన పిండాలు పురుగులుగా మారాయి. దీంతో విసుగు చెందిన రాముడు శివుడిని ప్రార్థించాడు. మంథరవనానికి అంటే ఈ తిలతర్పణపురికి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేయమని శివుడు రాముడికి సలహా ఇచ్చాడట. రాముడు ఈ ఆలయాన్ని సందర్శించి, తన తండ్రి దశరథుని ఆత్మ కు మోక్షాన్ని కలిగించమని పూజ చేశాడు. అతనికి ఆశ్చర్యం కలిగించే విధంగా నాలుగు పిండాలు నాలుగు లింగాలుగా మారాయి. ఈ లింగాలు ఇక్కడ ఆది వినాయక ఆలయానికి సమీపంలో ఉన్న ముక్తేశ్వరాలయంలో ప్రతిష్టించబడ్డాయి.

నేటికీ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి 'పితృ దోషం' నుండి విముక్తి కోసం ప్రార్థనలు చేస్తారు. తిలతర్పణపురి అనే పేరే ఇది పూర్వీకులు తర్పణం విడిచిపెట్టిన ప్రదేశం అని సూచిస్తుంది.


ఈ ఆలయంలో వినాయ విగ్రహం ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. వినాయకుడు తన నడుము చుట్టూ నాగుపామును ధరించి కనిపిస్తాడు. ఆలయ తూర్పు ద్వారం వద్ద నాగనందిని చూడవచ్చు. నందిదేవుడు సాధారణంగా శివాలయాలతో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. ఈ వినాయకుని ఆలయంలో కూడా కనిపించడం విశేషం.

ఇక ఆది వినాయకుడికి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ ప్రదేశం కాశీ లేదా రామేశ్వరంతో సమానంగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజున ఇక్కడ తర్పణం చేయడం విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ఇది బహిరంగ మైదానం. ఆది వినాయకుని మందిరం ప్రధాన ఆలయం వెలుపల ఉంది. ఇక్కడ వినాయకుడిని పూజించడం వల్ల కుటుంబ సంబంధాలలో శాంతి నెలకొంటుందని, వినాయకుని ఆశీస్సులతో పిల్లల జ్ఞాపకశక్తి మెరుగవుతుందని కూడా నమ్ముతారు.