కెసిఆర్ కు ప్రొఫెసర్ కోదండరాం శాపం
- ప్రొఫెసర్ కోదండరాం కెసిఆర్ కు శాపమిచ్చారు
- ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యాం బతక లేవు
- కోెదండరాం కోపం 2019 నాటికి ఉగ్రరూపం తీసుకుంటుందా
తెలంగాణా సంయుక్త కార్యాచరణ కమిటీ ( జెఎసి) నేత ప్రొపెసర్ కోదండరామ్ కి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం చాలా కోపమెచ్చింది. 2019 ఎన్నికల నాటికి ఈ కోపం ఏ రూపం తీసుకుంటుందో ఇపుడే చెప్పలేం కాని, ఇపుడయితే, తెలంగాణా ప్రభుత్వం మీద ఆయన తీవ్రంగా దాడిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేరెత్తడం లేదు గాని, రా ష్ట్ర ప్రభుత్వం అని చెబుతూ కెసిఆర్ వైఫల్యాల మీద రోజూ కన్నెర్ర చేస్తూనే ఉన్నారు.
ఆయన చేతిలో ఒక నిండు కమండలం ఉంటే, ఈ పాటికి పిడికిలితో నీళ్లుచల్లి శపించి వుండే వాడే. కమండలం లేదు. ఆలాగని ఆయన వూరుకునే బాపతు కాదు. మైకు పుచ్చుకుని శాపం ఇచ్చినంత పని చేసేశాడు.“ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతుఏడ్చిన రాజ్యం బాగుపడవు “ అని నిన్న శాపం వదిలాడు.
కెసిఆర్ గారి తెలంగాణా రాజ్యంలోగత రెండున్నరేళ్లుగా ఆయన పల్లె పల్లె తిరిగి పరిస్థితులు గమనించి, వ్యవసాయమెలా ఉందో, రైతెలా బతుకుతున్నడో చూసొచ్చి అన్న మాట ఇది.
ఇపుడు తాజాగా ఫార్మాకంపెనీలకు భూములిచ్చేందుకు ప్రభుత్వం వ్యవపాయ భూములను సేకరించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని యాచారం వద్ద ఫార్మాకంపెనీలకు భూములిచ్చేది లేదనిచెబుతున్న పేద రైతులతో ఆయన గొంతు కలిపారు.
వారి సమావేశం పాల్గొన్నారు. ప్రభుత్వం తన మిగులు భూములను వదిలేసి, పచ్చని పంట పొలాలను పరిశ్రమలకు అందివ్వాలనుకోవడం సరికాదని హెచ్చరిక చేశారు. యాచారం మండలంలోని కుర్మిద్ద, కుర్మిద్ద తాండ, నానక్ నగర్ రైతులతో ఆయన మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ దగ్గిర, మహేశ్వరం హార్డ్ వేర్ పార్క్ దగ్గిర ప్రభుత్వం భూములున్నా ఈమండలంలోని పేదల పంట పొలాలను సేకరించాలను కోవడం మానుకోవాలని హితవు చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23న రైతు దీక్ష చేపుడుతున్నట్లు చెప్పారు.దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.
కోదండరాం ఇలా ’కెసిఆర్ సార్’ మీద నిప్పులు చెరగడం ఇది మొదటి సారి కాదు. ఇద్దరూ బాగున్న రోజులలో కెసిఆర్ ని ఆయన గౌరవంగా సార్ అనే పిలిచేవారు. ఇపుడు అదే సార్ మీద న్యాయం కోసం కయ్యానికి సిద్దమయ్యారు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే, ఆ మధ్య ఈ ప్రొఫెసర్ చేసిన ఒక హెచ్చరిక చాలా మందిని కలవర పెట్టింది. ‘‘తెలంగాణ ప్రజల జీవితాలను బాగు చేయడం చేతకాకపోతే పక్కకు తప్పుకోండని” అని ఆయన పాలకులకు (టిఆర్ ఎస్ ప్రభుత్వం) హెచ్చరిక చేశారు. ఇది కెసిఆర్ కు చేసిన హెచ్చరిక కాదా?
ఫ్రొఫెసర్ కోదండరాం సుతిమెత్తని విమర్శనా వైఖరికి మారుపేరు. ఆయనెపుడూ ఎవరిని కటువుగా మాట్లాడారు. తెలంగాణా ఉద్యమ కాలంలో కూడా ఆంధ్ర పాలకులు అని పాఠ్యపుస్తక పరిభాషలోనే విమర్శించారు తప్ప, రాజకీయబూతులెపుడూ మాట్లాడలేదు.భూసేకరణ దగ్గర నుంచి ఇపుడు తాజాగా ఏర్పడిన కొత్త జిల్లాల దాకా కోదండరాం తెరాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మెజారిటి నిర్ణయాలను తప్పు పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్లడం లేదని, పారిశ్రామిక వేత్తలకు, రియల్ ఎస్టేట్ బిజినెస్దారులకు అనుకూలంగా వెళుతూఉందనిచెప్పారు.భూసేకరణ 2013 చట్టం ప్రకారం జరపకుండా రైతాంగానికి వ్యతిరేకంగా జరుపుతున్నారని ఆరోపించారు.
“మీరు తప్పుకుంటే మేం చేసి చూపిస్తాం” అని కూడా. అన్నారు.
“రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నం ఒక్కటీ జరగలేదు. ప్రజలకు ఫలితాలు ఇంకెపుడు అందుతాయి?” అని నిలదీశారు. ఈ ప్రశ్నలు 2019 నాటికి ఏ రూపం తీసుకుంటాయో చూడాలి. సుడిగాలిలా కెసిఆర్ ప్రభుత్వాన్ని చుట్టుముడతాయా లేక చతికిలపతాయా?