వైఎస్ఆర్ సి సభ్యలకు సభాహక్కు ల నోటీసులు
- 12 మంది ప్రతిపక్ష సభ్యులకు సభా హక్కుల నోటీసులు
- సభలో దురుసు ప్రవర్తించినందుకు చర్యలు మొదలు
- నోటీసులు అన్యాయమంటున్న వైఎస్ఆర్ సి
సెప్టెంబర్ నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో తీవ్ర గొడవ సృష్టించిన 12 మంది ప్రతిపక్ష సభ్యులకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ పన్నెండు మంది సభ్యులు అక్టోబర్ 25, 26 తేదీలలో కమిటీ ముందు హాజరయి తన వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి వారిని కోరారు.
నోటీసులు అందుకున్న శాసన సభ్యులు: కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాదర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, పాశం సునీల్ కుమార్, కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులు.
సెప్టెంబర్ రెండో వారంలో జిఎస్ టి బిల్లు ను ఆమోదింప చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ మూడు రోజుల పాటుల సమావేశమయింది. ఈ సందర్బంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ సి సభ్యులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయినందుకు ప్రభుత్వం మీద , హోదా ఇవ్వనందుకు కేంద్రం మీద నిరసన తెలుపుతూ సభను రోజూ స్థంభింప చేశారు.
మూడోరోజున ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంది. ప్రతిపక్షానికి చెందిన మహిళా శాసన సభ్యులు అసంబ్లీ మహిళా మార్షల్స్ తో గొడవపడ్డారు. తోసేశారు. దాడికూడా జరిగిందని చెబుతారు. నల్లబాడ్జీలు ధరించిన ప్రతిపక్ష సభ్యులు ప్రత్యేకహాదా ఇవ్వాలని నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను చేపట్టకుండా అడ్డుకున్నారు. ప్రత్యేక హాదా సంజీవనేం కాదు అని అన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభ నడవలో భీభత్సం సృష్టించారు.
సభను దారికి తీసుకురాలేక స్పీకర్ రెండు సార్లు వాయిదా కూడా వేశారు. ఈ రగడ మధ్య అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష సభ్యులు తమ దురుసు ప్రవర్తన తో సభాహక్కులకు భంగం కలిగించారని, వారిమీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివర ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించాలని సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్నుసరించి ఈ రోజు గొడవలో పాల్గొన్న సభ్యలందరికి నోటీసులు జారీ చేశారు.
అయితే, తమ పార్టీ సభ్యులకు సభాహక్కుల నోటీసు ఇవ్వడాన్ని పార్టీ శాసన సభ్యుడు వై.వి విశ్వేశ్వరెడ్డి అభ్యంతరం తెలిపారు.
ఏ సభా హక్కులకు వారు భంగం కలిగించారు. ఈ పన్నెండు మంది సభ్యులు ఏం నేరం చేశారు. రాష్ట్ర ప్రజలంతా కోరుతున్న ప్రత్యేక హోదా డిమాండ్ ను సభలో గట్టిగా వినిపించాలనుకోవడమే తప్పా? ఇలాంటి సందర్భాలలో సభ స్తంభించడం సహజం. అది తప్పా” అని విశ్వేశ్వరెడ్డి అడిగారు.
ప్రత్యేకహోదా కోసం తాము చేస్తున్న పోరాటం ఆగదని చెబుతూ, ఈ 12మందిని కాదు, మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినా తమ పోరాటం ఆగదని రెడ్డి పేర్కొన్నారు.
హిరంగంగా పార్టీ మారి, రాజ్యంగాన్ని ఉల్లంఘించిన వారి మీద 20మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోకుండ ఒక చిన్న సంఘటన మీద తీవ్రంగా స్పందించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.ప్రివిలేజ్ కమిటీ నిర్వహణ తీరును కూడా ఆయన తప్పు పట్టారు.
’పార్టీ మారిన జ్యోతుల నెహ్రు స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినా ఇప్పటికీ నెహ్రునే కొనసాగించడం సభా మర్యదాకు భంగం కాదా’ అయన ప్రశ్నించారు.