అప్పుల భారం రాష్ట్రానిది, అందలం చంద్రబాబుదా?
- అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నాయుడు అప్పుల భారం పెంచుతున్నాడు: కాంగ్రెస్
- అప్పు చేసి అమరావతికి హంగులా?
- చంద్రబాబు విధానాల వల్ల ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచమంతా అప్పుచేసి అమరావతికి రంగులు పూసి, హంగులద్దాలని చూస్తున్నాడు,దీని వల్ల ఒరిగేదేమీ లేదు, పెరిగేవీ అప్పులేనని ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
వచ్చే పదేళ్లలో రోడ్లు, పార్కుల వంటి మౌలికావసరాలకు రు. 40 వేల కోట్ల ఖర్చచేయాలను కోవడం , ఈ మొత్తాన్ని యావత్తుగా అప్పుగా తీసుకురావలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను పురమాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ తులసి రెడ్డి, అధికార ప్రతినిధి జంగా గౌతమ్ తప్పు పంటారు. దీనితో రాష్ట్రం అప్పుల బారిన పడుతుందని అంటూ, అప్పు అందరిది , అందలం కొందరిదా అని వారు ప్రశ్నించారు.
ఇప్పటికే రాష్ట్రం అప్పులో వూబిలో కూరుకు పోయి ఉందని మార్చి 31 నాటికి రాష్ట్రానికి రు. 1, 90,153 కోట్ల అప్పు ఉందని తులసి రెడ్డి అన్నారు.చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం కొనసాగితే, ఎపి ముద్దుగా ఐపి అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మంచి రాష్ట్రంగా ఉండటానికి ప్రపంచ స్థాయి రాజధానియే ఉండాల్సిన అవసరం లేదని, భారతదేశంలో కేరళ , ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలకు పెద్ద పెద్ద రాజధాని నగరాలు లేవన్న విషయాన్ని వారు గుర్తు చేశారు.
ద్రవ్యజవాబు దారి చట్టం (ఎఫ్ఆర్ బిఎం) చట్టం ప్రకారం ఏ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణభారం స్థూల జాతీయదాయంలో మూడు శాతం మించరాదని కట్టడి చేసిన, చంద్రబాబు నాయుడు పుణ్యాన ఇది 6.1శాతానికి పెరిగిందని ఆయన అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కనిపెట్టింది కాదని, కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనర ల్ (కాగ్) వెల్లడించిందని చెబుతు ఇపుడు అమరావతి కోసం చేస్తున్న అప్పులు రాష్ట్రాన్ని పతనం వైపు తీసుకువెళతాయని, దీని వల్ల ప్రజల మీద పన్నుల భారం పడుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.