ప్రధాని పీఠం: శరద్ పవార్ లెక్కలివి...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కూడ ప్రధాని పీఠంపై కన్నేశారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కూడ ప్రధాని పీఠంపై కన్నేశారు. 21 పార్టీల కూటమిలో శరద్పవార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటులో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
దేశంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 21 పార్టీలున్నాయి.ఈ కూటమిలో ఎన్సీపీ కూడ ఉంది. నెల రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన 21 పార్టీల సమావేశంలో ఈ పార్టీలన్నీ ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.
2014 ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి మెజారిటీ స్థానాలను దక్కించుకొన్నాయి.అయితే వచ్చే ఎన్నికల్లో కూడ శివసే, బీజేపీలు మరోసారి కూటమిగా కలిసి పోటీ చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన శివసేన బీజేపీతో జత కట్టింది.
కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకొనేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
శివసేన పార్టీలో ఉన్న టీవీ యాక్టర్ ఇటీవలనే ఎన్సీపీలో చేరాడు. బలమైన అభ్యర్ధులకు ఎన్సీపీ గాలం వేస్తోంది. ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకొంటే 21 పార్టీల కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శరద్ పవార్ భావిస్తున్నారు.
ఈ కూటమిలో మమత బెనర్జీకి శరద్ పవార్ ప్రధాని పదవికి పోటీగా నిలిచే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఓటర్లు ఎన్సీపీ తరపున ఎక్కువ ఎంపీలను గెలిపిస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.