Asianet News TeluguAsianet News Telugu

అంచనాలకు అందని టీసీఎస్.. రెండో త్రైమాసికం లాభం 1.8% ఓన్లీ

దేశీయ అతిపెద్ద సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ద్వితీయ త్రైమాసికంలో లాభం 1.8 శాతం మాత్రమే పెరిగి రూ. 8,042 కోట్లకు చేరుకున్నది. ఇక సంస్థ ఆదాయం మాత్రం ఆరుశాతం వృద్ధితో రూ. 38,977 కోట్లకు చేరింది. దీంతో సంస్థ తన ఇన్వెస్టర్లకు షేర్‌పై రూ. 40 ప్రత్యేక డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

TCS reports net profit of Rs 8,042 crore in Q2 results
Author
Hyderabad, First Published Oct 11, 2019, 4:05 PM IST

ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. గురువారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది రూ. 8,042 కోట్లకు పరిమితమైంది. 

గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో టీసీఎస్ నికర లాభం రూ. 7,901 కోట్లు. ఇక జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి రూ. 36,854 కోట్ల నుంచి రూ. 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4%గా నమోదైంది.

సాధారణంగా దేశీ ఐటీ సేవల కంపెనీలకు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం మెరుగ్గా ఉండే నేపథ్యంలో టీసీఎస్‌ ఆదాయ వృద్ధి 9–9.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని, లాభం రూ. 8,304–8,322 కోట్ల మేర ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి.

క్షీణించిన రూపాయి మారకం విలువ, వీసా ఖర్చులు తగ్గడం వంటి సానుకూల అంశాలు ఉన్నా టీసీఎస్ లాభాలు.. అంచనాలకు అనుగుణంగా లేకపోవడం అశ్చర్యకరమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

టీసీఎస్‌ గతంలో ఇచ్చిన రెండంకెల స్థాయి వృద్ధికి రిస్కులు పొంచి ఉన్నాయనడానికి తాజా ఫలితాలు నిదర్శనమని, స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 9 శాతానికి దిగువనే ఉండొచ్చని బ్రోకరేజి సంస్థ ఎమ్‌కే గ్లోబల్‌ పేర్కొంది.

రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ టీసీఎస్‌తోనే ప్రారంభం కావడంతో.. మిగతా కంపెనీల ఫలితాలెలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 1.09 శాతం క్షీణించింది. జూన్‌ క్వార్టర్‌లో లాభం రూ. 8,131 కోట్లు. మరోవైపు తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 38,172 కోట్లుగా ఉండగా, రెండో త్రైమాసికంలో రూ. 38,977 కోట్లకు చేరింది.

నిర్వహణ పనితీరుకు సంబంధించి వడ్డీలు, పన్నులకు ముందు లాభాలు (ఎబిట్‌) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతం క్షీణించి రూ. 9,361 కోట్లకు చేరగా, మార్జిన్ 250 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. తొమ్మిది త్రైమాసికాల కనిష్ట స్థాయి 24 శాతానికి పరిమితమైంది. 

సీక్వెన్షియల్‌గా చూసినా మార్జిను 15 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. సామర్థ్యాలను పెంచుకునే దిశగా మరింత ఇన్వెస్ట్‌ చేస్తుండటం మార్జిన్లపై ప్రభావం చూపినట్లు టీసీఎస్ వెల్లడించింది. కాగా, విశ్లేషకులు ఎబిట్‌ రూ. 9,834 కోట్లుగాను, మార్జిను 25 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. కంపెనీ 26–28 శాతం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

‘ఈ ఏడాది ప్రారంభంలో మేం అంచనా వేసిన దానికన్నా ఫలితాలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.   ఆర్థిక సేవలు, రిటైల్‌ విభాగాల్లో ఒడిదుడుకులు తీవ్రంగా పెరిగినప్పటికీ రెండో త్రైమాసికంలో స్థిరంగా వృద్ధి నమోదు చేయగలిగాం. మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా మా సేవలకు డిమాండ్‌ కొనసాగుతుందని ధీమాగా ఉన్నాం’ అని టీసీఎస్ సీఈఓ రాజేష్‌ గోపీనాథన్ చెప్పారు.

‘గత ఆరు త్రైమాసికాల్లోనే అత్యధిక స్థాయిలో ఉన్న క్యూ2లో ఆర్డర్‌ బుక్‌ ఇందుకు నిదర్శనం.  ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సవాళ్లతో కూడుకున్నట్లే కనిపిస్తోంది. పెద్ద సంస్థలు, బ్యాంకులు.. ఐటీ వ్యయాల్లో కోత పెడుతుండటంతో ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్‌ విభాగంలో మందగమనం కొనసాగుతోంది. ఇది ఆర్థిక ఫలితాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం చూపింది. 6.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం లభించే అవకాశాలున్న పలు డీల్స్‌ను రెండో త్రైమాసికంలో కుదుర్చుకున్నాం’ అని టీసీఎస్‌ సీఈవో రాజేష్‌ గోపీనాథన్ వివరించారు. 

టీసీఎస్ మొత్తం ఆదాయంలో డిజిటల్‌ సేవల విభాగం వాటా 33.2 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే డిజిటల్‌ ఆదాయం 27.9 శాతం పెరిగింది. అయితే, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.

ప్రాంతాల వారీగా యూరప్, ఇంగ్లాండ్‌లో ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉంది. కానీ అమెరికాతో పాటు భారత్, మధ్యప్రాచ్యం, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. రెండో క్వార్టర్‌లో ఉద్యోగుల సంఖ్య నికరంగా 14,097 మేర పెరిగింది. మొత్తం సిబ్బంది సంఖ్య 4,50,738కి చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30,000 పైచిలుకు క్యాంపస్‌ నియామకాలు చేపట్టనుంది.  అట్రిషన్‌ రేటు 11.6 శాతంగా ఉంది.

ఆదాయాలు కొంత తగ్గడం, కొత్త సిబ్బందిపై భారీ వేతనాల వ్యయాలు తదితర అంశాలు మార్జిన్లపై ప్రభావం చూపినట్లు సంస్థ సీఎఫ్‌వో వి. రామకృష్ణన్‌ చెప్పారు. అయితే, వ్యవస్థాగతంగా సవాళ్లేమీ లేకపోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాపారపరంగా ఇప్పటికే పన్ను మినహాయింపులు ఉన్నందున కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వల్ల కంపెనీకి కొత్తగా ప్రయోజనాలేమీ ఉండబోవని రామకృష్ణన్‌ పేర్కొన్నారు.

రూ. 1 విలువ గల షేర్ ఒక్కింటికి రూ. 5 చొప్పున రెండో విడత మధ్యంతర డివిడెండ్‌తోపాటు రూ. 40 మేర ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించాలని టీసీఎస్‌ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 18న షేర్ రికార్డు చేసిన తర్వాత 24న చెల్లింపులు జరుపుతారు. అయితే టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు స్టాక్‌ మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. సంస్థ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.86 శాతం క్షీణించి రూ. 2,004 వద్ద క్లోజయ్యింది.

 

 

 

 

 

 

 

 

 

 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios