భర్తతో గొడవపడి కన్నబిడ్డను కర్కశంగా చంపేసిందో తల్లి. మూడునెలల పసిగుడ్డు అని కూడా చూడకుండా ఆవేశంలో దారుణానికి ఒడిగట్టింది.
న్యూఢిల్లీ : భర్తతో గొడవపడి ఓ మహిళ తన మూడు నెలల పసికందును గొంతు కోసి murder చేసిన ఘటన న్యూ ఢిల్లీలో కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. వాయువ్య ఢిల్లీలోని షాలిమార్ బాగ్కు చెందిన నిందితురాలు అంజలీ దేవి (26)ని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2.14 గంటలకు పసికందును ఆమె తల్లి హత్య చేసినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ తన మెడలోని దారంతో శిశువు గొంతుకు బిగించి చంపినట్లు తెలిసింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్వెస్ట్) ఉషా రంగాని తెలిపారు.
గురువారం ఉదయం దేవికి ఆమె భర్తకు ఏదో విషయం మీద గొడవ జరిగింది. ఆ తరువాత భర్త తన పనికి వెళ్లిపోయాడు. అయితే గొడవ విషయంలో భర్త మీద విసుగ్గా ఉన్న భార్య... ఆవేశానికి లోనై పసికందును హత్య చేసినట్టు ఆమె తెలిపిందన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశామని, నిందితురాలిని అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. "చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపాం, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం" అని డిసిపి తెలిపారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని మేడ్చల్ లో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి suicide attemptకి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు బతికి బయటపడగా, ఇద్దరు పిల్లలు, తల్లి మృత్యువాత పడ్డారు. క్షణికావేశంలో తాను చనిపోవడమే కాకుండా ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా తనతో పాటు తీసుకువెళ్లింది ఆ తల్లి. తాను లేకపోతే చిన్నారుల భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన, భర్త సరిగా చూసుకుంటాడో లేదోనన్న భయం ఆమెను ఈ దారుణానికి ఒడిగట్టేలా చేశాయి. వివరాల్లోకి వెడితే..
భర్త వేధింపులు తాళలేక ఓ ఇల్లాలు ప్రాణ త్యాగానికి సిద్ధమైంది. తాను చనిపోతే పిల్లల్ని భర్త చూసుకోడనే ఉద్దేశ్యంతో పిల్లలతో సహా చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడగా, ఐదేళ్ల పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు. మేడ్చల్ పోలీస్ ఠాణా పరిధిలో ఈ విషాదం బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబీకుల వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామానికి చెందిన బ్రహ్మణపల్లి భిక్షపతి ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ మండలం నూతన్ కల్ గ్రామానికి చెందిన శివరాణితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముద్దులొలికే ముగ్గురు పిల్లలు.. జగదీష్ (5), దీక్షిత్ (3), ప్రణీత (1) ఉన్నారు. కొద్దినెలలుగా భార్యభర్తల పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్తానంటూ...
బుధవారం ఉదయం కూడా వారి మధ్య మాటామాటా పెరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో భర్త పనికి వెళ్లిన తరువాత పెద్ద కుమారుడు జగదీష్ ను అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్తున్నానని మరిది రమేష్ తో చెప్పి ఇంట్లోంచి వెళ్లింది. అయితే 10 గంటల వరకూ వదిన ఇంటికి రాకపోవడంతో రమేష్ సోదరుడికి సమాచారమిచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి చుట్టుపక్కల వెతికారు. కాగా, శివరాణి చెరువు పక్కన కనిపించిందని స్థానికులు చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద కుమారుడు జగదీష్ చెరువు గట్టుపై ఏడుస్తూ కన్పించడంతో ఆరాతీశారు. ‘అమ్మ, తమ్ముడు, చెల్లి నీళ్లలో ఉన్నారని’ ఏడుస్తూ చెప్పడంతో చెరువులో గాలించారు. ముగ్గురి మృతదేహాలనూ బయటికి తీశారు. విషయం తెలుసుకున్న శివరాణి తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని భిక్షపతి, అతడి కుటుంబ సభ్యులను చితకబాదారు. పోలీసులు వారిని అదుపుచేశారు.
