యువతి అనుమానాస్పద మృతి.. అత్యాచారం చేసి చంపేశారా..?
కర్ణాటకలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కాగా.. ఆ యువతిపై అత్యాచారం చేసి.. అనంతరం చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
దేశంలో మహిళలకు రోజు రోజుకీ రక్షణ కరువైపోతోంది. ఇటీవల యూపీలో ఓ యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఖమ్మంలో ఓ మైనర్ బాలికపై ఇలాంటి దాడే జరిగింది. కాగా.. తాజాగా కర్ణాటకలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కాగా.. ఆ యువతిపై అత్యాచారం చేసి.. అనంతరం చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని కుదూరు పోలీస్స్టేషన్ పరిధిలోని బెట్టహళ్లి గ్రామం వద్ద ఒక తోటలో 18 సంవత్సరాల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన సదరు యువతి అప్పటి నుంచి కనిపించలేదు. తోటలో విగతజీవిగా కనిపించింది.
శవాన్ని పూడ్చినప్పటికీ ఘటనాస్థలంలో రక్తపు మరకలు, గుంత తవ్విన గుర్తుల ఆధారంగా అనుమానంతో తవ్వి చూడగా మృతదేహం బయటపడింది. తలపై బలమైన గాయం, శరీరంపై రక్త గాయాలు ఉన్నాయి. అసిస్టెంట్ కలెక్టర్ దాక్షాయిణి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు మూడు సంవత్సరాలుగా ఒక యువకుడిని ప్రేమిస్తోంది. ఇందుకు సంబంధించి పోలీస్స్టేషన్లో ఇరువైపుల పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అయితే అనూహ్యంగా.. ప్రాణాలు పోయి కనిపించింది. హత్య ఎలా జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.