మొహం మీద భారతీయ జెండా పెయింట్ వేసుకున్నందుకు ఓ మహిళను గోల్డెన్ టెంపుల్ లోకి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ : పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో భారత జెండా ముఖానికి పెయింటింగ్ వేసుకున్నందుకు.. తనను లోనికి రానివ్వలేదని ఓ మహిళ ఆరోపించింది. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవిత్ర సిక్కు మందిరం అయిన గోల్డెన్ టెంపుల్ లో ఒక గార్డుతో జరిగిన వాగ్వాదం ఈ వీడియోలో ఉంది.
ఆమెను లోపలికి రానివ్వకపోవడంతో ఎందుకని ప్రశ్నించడం.. దానికతను ఏదో చెప్పడం.. అస్పష్టంగా వినిపిస్తుంది. అంతలో ఆ యువతితో ఉన్న వ్యక్తి "ఇది భారతదేశం కాదా?" అని గార్డును అడిగితే.. అతను "ఇది పంజాబ్" అని చెప్పడం చూడవచ్చు. దీన్నంతా మహిళ ఫోన్లో చిత్రీకరించింది. ఇందులో ‘ఇది భారతదేశం కాదా..’ అని వారు పదేపదే గార్డును అడుగుతున్నట్లు.. గార్డు అంగీకరించకుండా దూకుడుగా తల ఊపినట్లు చూపిస్తుంది.
గార్డు చాలా వింతగా మాట్లాడుతున్నాడని మహిళ అంటుండంతో.. అప్పుడే ఆమె వీడియో తీయడాన్ని గమనించి గార్డు ఆమె ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నించడంతో క్లిప్ ముగుస్తుంది. క్లిప్ ప్రారంభంలో సదరు యువతి ఒక క్షణం మాత్రమే కనిపిస్తుంది, కానీ వీడియో మొత్తంలో ఆమె గొంతు వినవచ్చు.
దీనిమీద గోల్డెన్ టెంపుల్ను నిర్వహించే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ.. అధికారి దురుసు ప్రవర్తనకు క్షమాపణలు కోరింది. అయితే మహిళ ముఖంపై ఉన్న పెయింటింగులో అశోకచక్రం లేదని.. అందుకే అది భారత జెండా కాదని పేర్కొంది. "ఇది సిక్కుల పుణ్యక్షేత్రం. ప్రతి మత స్థలానికి దాని స్వంత డెకోరమ్ ఉంటుంది. మేము ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాం. ఒక అధికారి తప్పుగా ప్రవర్తిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఆమె ముఖంపై ఉన్న జెండాలో అశోక చక్రం లేనందున అది మన జాతీయ జెండా కాదు. రాజకీయ జెండా అయి ఉండవచ్చు" అని ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గుర్చరణ్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.
