మంగళవారం మటన్ వంటకం ఓ ప్రాణాన్ని తీసింది.. భార్య భర్తల మధ్య గొడవను అడ్డుకున్న పొరుగింటి వ్యక్తి హత్య
మధ్యప్రదేశ్లో మంగళవారం మటన్ వండుతున్నావా? అని భర్తను భార్య అడ్డుకుంది. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అరుపులు విని పొరుగునే ఉండే వ్యక్తి వచ్చి వారికి సర్ది చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత పొరుగింటి వ్యక్తిని ఆ భర్త హతమార్చాడు.
భోపాల్: హిందు మతంలో కొందరు మంగళవారాన్ని పవిత్ర వారంగా భావిస్తారు. ఆ రోజు నాన్ వెజ్ తినరు. కొందరైతే ఉపవాసాలూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ వ్యక్తి మంగళవారం రోజు ఇంటికి మటన్ కొని తెచ్చారు. మంగళవారం మటన్ తీసుకురావడాన్ని ఆయన భార్య వ్యతిరేకించింది. కానీ, ఆ వ్యక్తి ఆగలేదు. ఆ మటన్ను వండటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పొరుగింటి వ్యక్తి చివరకు హత్యకు గురయ్యాడు.
భోపాల్లో పప్పు అహిర్వార్ అనే వ్యక్తి మంగళవారం రోజు మటన్ను కొని ఇంటికి తెచ్చాడు. ఆయనే స్వయంగా ఆ మటన్ను వండటం ప్రారంభించాడు. కానీ, మంగళవారం మటన్ వండటాన్ని ఆయన భార్య తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
Also Read: మటన్ బిర్యానీ మొదలు చిల్లి చికెన్ వరకు.. ఆ జైలులో స్పెషల్ మీల్స్.. మంత్రి కోసమేనా?
వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా చప్పుళ్లు విని పొరుగునే ఉండే బిల్లు అక్కడికి వచ్చాడు. గొడవ మధ్యలో జోక్యం చేసుకున్నారు. వారిద్దరినీ విడగొట్టి.. సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు ఆ గొడవను సద్దుమణిగించాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. కానీ, పప్పు అహిర్వార్ మాత్రం రగిలిపోయాడు. వెంటనే బిల్లు ఇంటికి పప్పు వెళ్లాడు. బిల్లు పై తీవ్రంగా దాడి చేసి చంపేశాడు.
బిల్లు మరణం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పప్పు భార్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పప్పుపై కేసు రిజిస్టర్ అయింది. అదే రోజు పోలీసులు పప్పును అరెస్టు చేశారు.