సారాంశం

దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయని  తెలిసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. 2024 సార్వత్రిక ఎన్నికలో కోసమే ఇప్పుడు ఈ అంశం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినేట్ సోమవారం ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లును నేడు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ మాజీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పలు ప్రశ్నలు సంధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి మోడీకి పదేళ్ల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారని కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయని తెలిసినప్పటికీ.. మోడీ దాదాపు పదేళ్లు ఎందుకు వేచి చూశారు. బహుశా 2024 కారణం కావచ్చు. అయితే ఓబీసీ మహిళలకు ప్రభుత్వం కోటా కల్పించకపోతే 2024లో యూపీని కూడా బీజేపీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆలోచించండి’’ అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

కాగా.. యూపీఏ 1, 2 ప్రభుత్వాల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తరువాత సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే అనేక సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తుంటారు. 

ఇదిలా ఉండగా.. సోమవారం సాయత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఇందులో మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కు ఆమోదం లభించిదని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాకపోతే ఈ సమావేశం ముగిసిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఎక్స్ లో పోస్టు చేశారు. కానీ కొన్ని గంటల్లోనే ఆ పోస్టును తొలగించారు.