కర్ణాటకలో ఇటీవలే అధికారాన్ని చేపట్టిన సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్న ప్రచారం సాగుతుండగా గోవధపై మంత్రి వెంకటేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో భజరంగ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హిందూ సంఘాల ఆగ్రహానికి గురయిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చినతర్వాత కూడా ఇదే హిందుత్వ వ్యతిరేక విధానాలను సిద్దరామయ్య ప్రభుత్వం కొనసాగిస్తోందని ప్రతిపక్ష బిజెపి ఆరోపిస్తోంది. తాజాగా కర్ణాటక పశుసంవర్దక శాఖ మంత్రి వెంకటేష్ గోవధ తప్పేమీ కాదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

పాడి పశువులే జీవనాధారమైన రైతులకు వయసు మళ్లిన పశువుల పోషణ భారంగా మారుతుందని మంత్రి వెంకటేష్ పేర్కొన్నారు. కాబట్టి గేదెలు, ఎద్దుల మాదిరిగానే పోషణ భారంగా మారిన గోవులను వధిస్తే తప్పేంటని మంత్రి ప్రశ్నించారు. ఇలా గోవధ తప్పుకాదంటూ మంత్రి వెంకటేష్ మాటలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 

గత బిజెపి ప్రభుత్వం గోహత్య నిరోధక, పశువుల సంరక్షణ బిల్లును 2021లో తీసుకువచ్చింది. అయితే ఈ బిల్లు గురించి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తున్న సమయంలో మంత్రి వెంకటేష్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

Read More  వ్యాపారాన్ని లాభాల్లో నడిపించేందుకు పూజ చేస్తానని బ్యూటీషియన్ పై అత్యాచారం..

హిందువులు పవిత్రంగా భావించే గోవులను సంరక్షించేందుకు గతంలో బిజెపి ప్రభుత్వం కర్ణాటకలో గోవధను నిషేధించింది. గోవధకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ నిరసనకు దిగింది. దీంతో కాంగ్రెస్ అధికారంలో రాగానే ఈ గోవధ నిషేదంపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రి వెంకటేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఆవులను ఎందుకు వధించకూడదన్న మంత్రి వెంకటేశ్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసారు. భారతీయులు ఆవులను దైవంగా పూజిస్తారని... వాటితో మానసిక అనుబంధం ఏర్పర్చుకున్నారని అన్నారు. తల్లిలా భావించే ఆవులను వధించడం తగదని... అందువల్లే గోవధను నిషేధించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గోవధ నిషేధాన్ని కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి బొమ్మై డిమాండ్ చేసారు.