Lok Sabha polls 2024: రాబోయే లోక్ సభ ఎన్నికలు 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అలాగే, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల కోసం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.
West Bengal: గత కొంత కాలంగా బీజేపీ వ్యతిరేకంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల పై వివిధ కారణాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణలు జరుపుతున్నాయి. అయితే, దీని వెనుక రాజకీయ కోణం వుందని ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు తీరును సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. రాబోయే లోక్ సభ ఎన్నికలు 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదంటూ మమతా బెనర్జీ అన్నారు. అలాగే, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల కోసం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.
ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని ఆరోపించిన మమతా బెనర్జీ.. 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాదని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు శక్తివంచన లేకుండా పోరాడతానని ఆమె తెలిపారు. ''పురూలియా నేల, బెంగాల్ నేల ప్రజల కోసం పోరాడే శక్తినిచ్చాయి. నేను ఎవరికీ భయపడను మరియు ప్రజల సంక్షేమం విషయంలో నేను నా శక్తితో పోరాడతాను! 2024లో @BJP4India ద్వేషం & హింస రాజకీయాలకు భారతదేశంలో ప్రవేశం ఉండదు” అని మమత తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
పురూలియాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమత మాట్లాడుతూ “బీజేపీ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి.. 2024లో మీరు ఎంత ప్రయత్నించినా అది (విజయం) జరగదు. నో ఎంట్రీ అంటే మీరు ప్రవేశించలేరు. ఇక నుంచి 2024లో బీజేపీకి నో ఎంట్రీ అంటున్నారు జనాలు అని మమత అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన ఆమె.. “ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో పాలనకు అంతరాయం కలిగించడానికి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలి. అవినీతిలో మోకరిల్లిన @BJP4India నాయకుల సంగతేంటి? నోట్ల రద్దు కారణంగా FY-22లో గుర్తించిన నకిలీ రూ. 500 నోట్ల గురించి ఏమిటి? ప్రతిస్పందించడానికి శ్రద్ధ వహించండి, మిస్టర్ బిజీ PM?" అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని బెంగాల్ సీఎం అన్నారు.
“నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు విషయంలో భారతీయులందరి జీవితాలను పూర్తిగా నాశనం చేసింది. వారు తమ ప్రయాణాన్ని అనేక నకిలీ వాగ్దానాలతో ప్రారంభించారు మరియు ఈ ప్రయాణం 8 సంవత్సరాల విఫలమైన ప్రయోగాలు తప్ప మరొకటి కాదు. @BJP4India భారతీయుల జీవితాలతో ఆటలాడుకుంది” అని మమత అన్నారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయంగా తన పాదముద్రను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరియు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గతంలో 2024 లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలని ప్రతిపక్షాలకు స్పష్టమైన పిలుపు ఇచ్చారు.
