పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక బిల్లు పాస్ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని యూనివర్సిటీలకు చాన్సెలర్గా గవర్నర్ స్థానంలో సీఎంను చేర్చే బిల్లును ఆమోదించుకుంది. ఈ బిల్లును బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. బెంగాల్లోని యూనివర్సిటీలకు చాన్సెలర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ఉండాలని ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లును అడ్డుకుంటామని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈ బిల్లుకు అనుకూలంగా 182 మంది చట్టసభ్యులు ఆమోదం తెలిపారు. కాగా, 40 మంది చట్టసభ్యులు వ్యతిరేకించారు.
రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని యూనివర్సిటీలు, స్టేట్ ఎయిడెడ్ యూనివర్సిటీల చాన్సెలర్గా ముఖ్యమంత్రి ఉండాలనే ప్రతిపాదనకు గత నెల 26న మమతా బెనర్జీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదాన్ని పొందింది.
యూనివర్సిటీలకు వీసీల నియామకమై గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ జగదీప్ దన్కర్కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. రాజ్భవన్ సమ్మతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వంలో చాలా యూనివర్సిటీలకు వైస్ చాన్సెలర్లను నియమించిందని గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆరోపించారు. రాష్ట్రంలో 25 యూనివర్సిటీలకు తన అనుమతి లేకుండా వీసీలను నియమించిందని ఈ ఏడాది తొలి నాళ్లలో గవర్నర్ ఆరోపణలు చేశారు.
కాగా, ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా మరో ఆరుగురు బీజేపీ చట్టసభ్యులు క్రమశిక్షణ నిబంధనల కింద అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా చర్యలు తీసుకుంది. అయినప్పటికీ వారు అసెంబ్లీ ప్రాంగణంలో ఈ బిల్లుకు, వారిపై తాత్కాలిక నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్కు అసెంబ్లీలో బలం ఉన్నదని బిల్లును పాస్ చేస్తున్నదని, కానీ, ఈ బిల్లును గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని, యూనివర్సిటీలకు చాన్సెలర్గా కావాలనే మమతా బెనర్జీ కలలు సాకారం కావని అన్నారు.
ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం అవసరం ఉండటం చేత.. ఒక వేళ గవర్నర్ ఆమోదించకుంటే.. తాము ఆర్డినెన్స్ తెస్తామని తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అన్నారు. ఆర్డినెన్స్కు కూడా గవర్నర్ ఆమోదం అవసరమే ఉంటుంది.
