ఫోన్లో బిజీగా స్టాఫ్.. ప్లాట్ఫామ్ మీదకు రైలు దూసుకెళ్లిన ఘటన వీడియో వెలుగులోకి.. (వీడియో)
ఉత్తరప్రదేశ్లో మథుర రైల్వే స్టేషన్లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్ఫామ్ మీదకు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు గల కారణాలు వెలుగోకి వచ్చాయి.

ఉత్తరప్రదేశ్లో మథుర రైల్వే స్టేషన్లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్ఫామ్ మీదకు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈ ఘటనకు గల కారణాలు వెలుగోకి వచ్చాయి. రైల్వేలో సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తంగా ఐదుగురిని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ఇక, ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ మారింది.
నివేదికల ప్రకారం.. ఉత్తర రైల్వేకు చెందిన షకుర్బస్తీ-మథుర MEMU (04446).. రాత్రి 10:49 గంటలకు స్టేషన్కు చేరుకుంది. అయితే రైలు గమ్యస్థానం చేరుకున్నాక ప్రయాణికులు అందులో నుంచి దిగిపోయారు. రైలు ప్లాట్ఫారమ్పైకి వచ్చిన తర్వాత డీటీసీ క్యాబ్ నుండి లోకో పైలట్లు దిగిపోయారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ రైలు లైటింగ్ సిబ్బంది సచిన్ క్యాబ్లోకి ప్రవేశించాడు. అతడు అక్కడ తన బ్యాగ్ను థ్రోటల్(ఇంజిన్ను నియంత్రించే పరికరం) మీద ఉంచి.. చాలా నిర్లక్ష్యంగా ఫోన్లో వీడియో కాల్ మాట్లాడటంలో నిమగ్నమయ్యాడు.
అయితే థ్రోటల్పై బ్యాగ్ ఒత్తిడి కారణంగా రైలు ఫార్వర్డ్ పొజిషన్లోకి వెళ్లి ప్లాట్ఫారమ్ మీదకు దూసుకెళ్లింది. డీటీసీ క్యాబ్లో సగం ప్లాట్ఫారమ్ నంబర్ రెండుపైకి ఎక్కింది. ఈ సంఘటనతో ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోయి రైలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక, ఈ ఘటన తర్వాత విచారణ చేపట్టిన అధికారులు.. సచిన్కు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 47 ఎంజీ/100 ఎంఎల్ రీడింగ్లో అతను మద్యం సేవించినట్లు తేలిందని నివేదిక పేర్కొంది.
అయితే తన డ్యూటీ ఇన్చార్జి హర్మాన్ సింగ్ సూచన మేరకు లోకో పైలట్ నుంచి క్యాబ్ కీని తీసుకురావడానికి వెళ్లినట్టుగా సచిన్ చెప్పారు. అయితే లోకో పైలట్ కీల లోపల ఉందని చెప్పడంతో.. డీటీసీ క్యాబ్లోకి వెళ్లినట్టుగా తెలిపారు. రైలులోకి వెళ్లి బ్యాగ్ పెట్టిన కొద్దిసేపట్లోనే రైలు కదలడంతో భయపడిపోయానని.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసే సమయానిక రైలు ప్లాట్ఫారమ్లోకి ప్రవేశించిందని చెప్పారు.
థ్రోటల్ ఫార్వర్డ్ పొజిషన్లో ఉందని, కీ 'ఆన్' పొజిషన్లో ఉందని కూడా చెప్పుకొచ్చారు. రైలు స్విచ్ ఆన్లో ఉంచినందుకు లోకో పైలట్ గోవింద్ హరి శర్మను సచిన్ తప్పుపట్టారు. అయితే లోకో పైలట్ శర్మ, తన లిఖితపూర్వక మాత్రం తాను డీటీసీ క్యాబ్ నుంచి దిగే ముందు సచిన్ కుమార్కు తాళం అయినట్టుగా చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది.. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు.