దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లను చంపిన దుండగులు వారి అసలు ఉద్దేశాన్ని పోలీసులకు తెలిపారు. ఈ ముగ్గురిని లావ్లేష్ తివారీ, మోహిత్ అలియాస్ సన్నీ, అరుణ్ మౌర్యలుగా గుర్తించిన సంగతి తెలిసిందే.
గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లు దుండగుల చేతిలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. వీరి హత్యలతో ఉత్తరప్రదేశ్తో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. అంతకు రెండు రోజుల ముందే అతిఖ్ కుమారుడు అసద్ , అనుచరుడు గుల్హామ్లు ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో అతిఖ్ కూడా హత్య గురికావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. హత్యల వెనుక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వుందని ఆరోపిస్తున్నాయి .
ఇదిలావుండగా.. అతిఖ్ అహ్మద్ అతని సోదరుడిని చంపిన ముగ్గురు వ్యక్తులు ఎవరు..? వారు ఎందుకు చంపాల్సి వచ్చింది..? అనే దానిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనికి పోలీసులు ఎఫ్ఐఆర్లో సమాధానం ఇచ్చారు. అతిఖ్ గ్యాంగ్ను ఖతం చేసి పేరు , గుర్తింపు సంపాదించాలనే తాము ఈ హత్యలకు పాల్పడినట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురిని లావ్లేష్ తివారీ, మోహిత్ అలియాస్ సన్నీ, అరుణ్ మౌర్యలుగా గుర్తించిన సంగతి తెలిసిందే.
అతిఖ్, అష్రఫ్లను పోలీస్ కస్టడీకి ఇచ్చిన విషయం తెలియగానే వారిని చంపాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ప్లాన్లో భాగంగా ఆసుపత్రి వద్దకు జర్నలిస్టుల రూపంలో వెళ్లిన దుండగులు .. అతి సమీపం నుంచి వారిని కాల్చి చంపారు. అతిఖ్ సోదరులను చంపడం ద్వారా ఉత్తరప్రదేశ్లో తమకు పేరు, గుర్తింపు వస్తుందని.. అదే తమ లక్ష్యమని నిందితులు పేర్కొన్నారు. ఇక నిందితులు ముగ్గురికి నేర చరిత్ర వుండటంతో పాటు పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
ALso Read: Atiq Ahmed: 17 ఏళ్లకే హత్య .. 44 ఏండ్ల నేర చరిత్ర.. 100 పైగా కేసులు.. చివరికి..
ఇకపోతే.. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ల హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉండగానే మీడియాకు లైవ్లో సమాధానాలు ఇస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు స్పాట్లోనే మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రయాగ్రాజ్లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ల హత్య జరగ్గానే ముఖ్యంగా యూపీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసులంతా అలర్ట్ మోడ్లో ఉన్నారు. అన్ని జిల్లాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నితమైన ఏరియాల్లో పెట్రోలింగ్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో అల్లర్లను ఎదుర్కొనే పోలీసులూ మోహరించారు. అతీక్ సోదరుల హత్య తర్వాత సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసానికి భద్రతను పెంచారు . ఈ హత్య జరిగిన తర్వాత కనీసం 17 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు
