మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుధీర్ఘ కాలం నిరసనలు వ్యక్తం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా నేడు ఢిల్లీలో సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, ప్రస్తుత స్థితి వంటి అంశాలపై సమీక్ష జరపనుంది.
న్యూఢిల్లీ : మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సంయుక్త కిసాన్ మోర్చా (Samyukt Kisan Morcha) ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలు నిలిపివేసిన కొన్ని నెలల తరువాత పరిస్థితిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి సంయుక్త కిసాన్ మోర్చా నేడు సమావేశం నిర్వహించనుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ (Deen Dayal Upadhyay Marg)లోని గాంధీ పీస్ ఫౌండేషన్ (Gandhi Peace Foundation)లో ఉదయం 10 గంటల నుంచి ఈ మీటింగ్ జరగనుంది.
సంయుక్త కిసాన్ మోర్చా రైతుల సుదీర్ఘ ఆందోళనకు నాయకత్వం వహించిన అనేక రైతు సంఘాల సమూహారం. రైతులకు చేసిన వాగ్దానాలను నిలబెట్టడానికి కేంద్రం ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఈ సమూహారం నేడు సమీక్ష నిర్వహిస్తుంది. ప్రభుత్వం వివాదాస్పద చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు ఆందోళన సందర్భంగా రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, కనీస మద్దతు ధర (MSP)పై చట్టపరమైన హామీ, నిరసనలో మరణించిన రైతుల బంధువులకు పరిహారం సహా ఆరు ఇతర డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడానికి అంగీకరించిన తరువాత ఈ బృందం గత ఏడాది డిసెంబర్లో ఆందోళనను నిలిపివేసింది.
నేటి సమావేశంలో సంయుక్తి కిసాన్ మోర్చా (SKM)లో సభ్యులుగా ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులు పాల్గొంటారు. నిజానికి ఈ సమావేశంతో పరిస్థితిని సమీక్షించడానికి ఉద్దేశించినప్పటికీ.. వారి ఆందోళనను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని ఆ సంఘం తోసిపుచ్చలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ బృందం కేంద్రానికి నిరసనగా జనవరి 31వ తేదీని ద్రోహ దినంగా గుర్తించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల వల్ల నిరసనలు విరమించుకున్నా.. ఇంత వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సమావేశంపై రైతు నాయకులు నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల నెరవేర్చడంపై చట్టపరమైన హామీ ఉండేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రోడ్ మ్యాప్ నిర్ణయించబడుతుంది అని తెలిపారు. కనీస మద్దతు ధర సమస్య, నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని చంపిన లఖింపూర్ ఖేరీ కేసు, ఆందోళన సమయంలో మరణించిన రైతులకు స్మారక చిహ్నం నిర్మించే విషయంపైలో ఎస్ కేఎం (SKM) మరింత స్పష్టత కోరుతుందని చెప్పారు. కాగా.. ఈ సమావేశంలో నియమాలు, నిబంధనలు, నిధుల ప్రస్తుత స్థితి, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రైతు సంఘాల నిర్ణయంపై కూడా ఈ బృందం అంతర్గత విషయాలను చర్చించే అవకాశం ఉంది.
కేంద్రం ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో మూడు వ్యవసాయ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. అదే నెల 17వ తేదీన దానిని లోక్ సభ ఆమోదించింది. సెప్టెంబర్ 20న రాజ్యసభ ఆమోదింది. అదే నెల 27వ తేదీన రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ మూడు వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ చట్టాలపై కోర్టు స్టే విధించింది. అయినప్పటికీ రైతులు ఆందోళన విరమించలేదు. చట్టాల రద్దు కోసం సుధీర్ఘ పోరాటం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. గతేడాది చివర్లో ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ చట్టాల రద్దు ప్రక్రియను పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. దీంతో రైతులు నిరసనలు విరమించారు.
