లిక్కర్ బ్రోకరేజ్, కమీషన్ తీసుకోవడమే కేజ్రీవాల్ మిషన్: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సీబీఐ విచారణ కూడా కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సీబీఐ విచారణ కూడా కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి గురించి మాట్లాడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మద్యం పరిశ్రమ నుంచి కమీషన్లు తీసుకుంటున్నారా? అని అసహ్యించుకుంటున్నారని అన్నారు.
లిక్కర్ బ్రోకరేజ్, కమీషన్ తీసుకోవడమే కేజ్రీవాల్కు ఉన్న ఒకే ఒక్క మిషన్ అని విమర్శించారు. కర్ణాట, కేరళ.. వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్తో డీల్స్ నడిపిన లిక్కర్ మాఫియా, కంపెనీలు.. ఇప్పుడు ఆప్ను వారి ‘‘పార్టీ’’గా మార్చుకున్నాయని ఆరోపించారు. ఆప్ మద్యం కుంభకోణం పేరుతో ఉన్న ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
ఇక, ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయడం ప్రారంభించింది. అప్పటి వరకు ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన వివిధ ఔట్లెట్ల ద్వారా మద్యం విక్రయాలు జరిగేవి. నూతన మద్యం పాలసీ ప్రకారం.. మద్యం విక్రయాలను ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీని 32 జోన్లుగా విభజించి ఒక్కో జోన్లో 27 షాపులతో 864 ఔట్లెట్లకు టెండర్లు ఆహ్వానించారు. మద్యం మాఫియాను అంతమొందించేందుకే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని కేజ్రీవాల్ సర్కార్ పేర్కొంది.
అయితే అందుకు విరుద్దంగా నూతన మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్త ప్రైవేట్ ఔట్లెట్లు పోటీపడి మద్యం విక్రయించడం ప్రారంభించడంతో.. మద్యం నాణ్యతపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. మద్యం పాలసీ అమలు తీరులోనూ అవినీతి జరిగిందన్న అనుమానాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు చేసింది.
అయితే ఈ ఆరోపణలను ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ ఖండించింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నించిందని ఆప్ ఎదురుదాడికి దిగింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించిందని.. ఒక్కొక ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించింది.