చరిత్ర మరిచి మాట్లాడుతున్న శివసేన : దేవేంద్ర ఫడ్నవిస్
బీజేపీతో పొత్తు పెట్టుకుని పాతికేళ్ల సమాయాన్ని వృథా చేసుకున్నామనే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఘాటుగా ప్రతిస్పందించారు.
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చరిత్రను మర్చిపోయారని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీతో జతకట్టి సేన 25 ఏళ్లు వృధా చేశామని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. శివసేన అధిపతి చరిత్రను మరిచిపోయి బీజేపీతో స్నేహం చేసి పాతికేండ్లు వ్యర్ధమయ్యాయని చెబుతున్నారని, 2012 వరకూ తమ కూటమికి బాలాసాహెబ్ నేతగా ఉన్నారని, ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు కూటమిలో కొనసాగిన బాలాసాహెబ్ నిర్ణయంపై ప్రశ్నలు రేకెత్తించేలా ఉన్నాయని ఫడ్నవీస్ అన్నారు.
శివసేన కేవలం వారికి అవసరమైన విషయాలను మాత్రమే గుర్తుంచుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ముంబై పురపాలక సంస్థలో బీజేపీ సభ్యులు ఉన్న సమయంలో శివసేన అప్పటికి అవిర్భవించలేదనీ, 1984 ఎన్నికల్లో శివసేన సభ్యుడు బీజేపీ టికెట్ పై పోటీ చేశారని, ఆ విషయాన్ని ఠాక్రేకు గుర్తు చేస్తున్నామని చెప్పారు. పలు మార్లు లోక్ సభ ఎన్నికల్లో శివసేన నేతలు.. బీజేపీ గుర్తుపై పోటీ చేసిన విషయం మరువరాదని ఫడ్నవీస్ అన్నారు. శివసేన తొలి సీఎం మనోహర్ జోషీ తమ గుర్తుపైనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు.
శివసేన బీజేపీతో ఉన్నప్పుడు వారు రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉండగా.. ఇటీవల జరిగిన నగర పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన నాలుగో స్థానానికి పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలతో థాకరే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే ఏదో మాట్లాడుతున్నారని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రామ జన్మభూమి పోరాటం జరుగుతున్న సమయంలో మీరెక్కడున్నారని ప్రశ్నించారు.
బీజేపీ కార్యకర్తలు తూటాలను, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఇప్పుడు మోదీ నిర్మిస్తున్నారన్న విషయం శివసేన నేతలు మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక నుంచి.. థాకరే హిందుత్వ గురించి మాట్లాడటం మానుకోవాలని ఫడ్నవీస్ హితవు పలికారు. బాలాసాహెబ్ ఠాక్రే జయంతోత్సవాలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనీసం ట్వీట్ చేయలేదని వ్యాఖ్యానించారు. బాల్ ఠాక్రే ఆశయాలు, విధానాలను వదిలిపెట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు హిందుత్వ గురించి మాట్లాడే హక్కులేదని బీజేపీ నాయకుడు రామ్ కదమ్ కూడా యద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యపై ఘాటుగా విమర్శించారు.