ముఖ్యమంత్రిని కారుతో ఢీకొట్టి చంపేందుకు స్కెచ్.. తప్పించుకున్న సీఎం, ముగ్గురు నిందితుల అరెస్ట్
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. బిప్లవ్ దేవ్ గురువారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు బయటకు వచ్చారు. తన అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు వేగంగా వెళ్లిపోయారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు ముఖ్యమంత్రిపై దాడికి ఎందుకు ప్రయత్నించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.