కొంతమంది తమకు ఎదరైన ఘటనలనుంచి గుణపాఠాలు నేర్చుకోరు. పురాతన తీగల వంతెన కూలి వందలమంది చనిపోయిన ఘటన మరువక ముందే కర్ణాటకలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక : మోర్బీ బ్రిడ్జి కూలి వందలమంది జలసమాధి అయిన ఘటన జరిగి రెండు రోజులే అయ్యింది. ఇంకా సహాయకచర్యలు పూర్తిగా ఆగిపోలేదు. ప్రజలింకీ ఈ ఘటననుంచి తేరుకోలేదు. అంతలోనే కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నదిపై ఉన్న ఇరుకైన సస్పెన్షన్ బ్రిడ్జి మీద కొంతమంది పర్యాటకులు కారును తీసుకువెడుతున్న వీడియో సంచలనంగా మారింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసినట్లు తెలుస్తోంది. శివపురా హ్యాంగింగ్ బ్రిడ్జి అని పిలిచే ఈ వంతెన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఎల్లపురా పట్టణంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ఉంది.
ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు బ్రిడ్జి మీదికి ఏకంగా కారును తీసుకొచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువుకు వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిని వెంటనే వెనక్కి పంపించారు.
బ్రిడ్జిపై కారును తోసుకుంటూ వెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారు వెనుక చాలామంది టూరిస్టులు కనిపిస్తున్నారు. వాహనాన్ని తోసేటప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నిందితుల తరఫున వాదించబోం.. మోర్బీ ఘటనపై బార్ అసోషియేషన్ కీలక నిర్ణయం
గుజరాతో రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై నడవాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు టూరిస్టులు చేసిన పని ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
