Toll Tax hike: దేశంలోని వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెంచనున్నది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు మారే అవకాశాలు కనిపిస్తోంది.
Toll Tax Hike: ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం మరోసారి భారీ బాదుడుకు సిద్దమైంది. ఊహించని విధంగా వాహనదారులపై భారం మోపడానికి రంగం సిద్దం చేస్తోంది. టోల్ ట్యాక్స్ పెంచేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించేవారి ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5 శాతం నుంచి 10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించినట్టు సమాచారం. టోల్ ఛార్జీలు పెంచడం వాహనదారులపై మరింత భారం మోపడమేనని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం.. ప్రతి యేటా ఏప్రిల్ 1 వరకు టోల్ ధరలను సవరిస్తుంటారు. ఈ పాలసీ ప్రకారం పెరిగిన ధరల్ని అమలు చేసేందుకు తగిన ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్హెచ్ఏఐ సంబంధిత విభాగాన్ని మార్చి 25లోపు ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. అవసరాలను బట్టి సమయానుసారంగా టోల్ సమస్యలపై పాలసీ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. కొత్త ధరల ప్రకారం.. కార్లు , తేలికపాటి వాహనాలపై ట్రిప్కు 5 శాతం ఎక్కువ పన్ను విధించబడుతుంది. అలాగే భారీ వాహనాలపై టోల్ పన్ను 10 శాతానికి పెంచవచ్చు.
2022లో టోల్ టాక్స్ ని 10 నుండి 15 శాతానికి పెంచారు. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల టారిఫ్ ధరలను అప్పట్లో కనిష్టంగా రూ.10 నుంచి రూ.60 వరకు పెంచారు. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ వేపై కిలోమీటరుకు రూ.2.19 చొప్పున టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 135 కి.మీ పొడవు, ఆరు లేన్ల 'ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే' మరియు ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వే కూడా ఈ సంవత్సరం టోల్ రేట్లు పెరుగుతాయి.
నెల వారీ పాసుల పెంపు..
టోల్ ప్లాజా నుండి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే నివాసితులకు అందించే నెలవారీ పాస్ సౌకర్యం కూడా 10 శాతం పెంచబడుతుంది. నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం టోల్ గేటుకు సమీపంలో ఉన్న వారికి సైతం ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే, ఎవరైనా నాన్-కమర్షియల్ వాహనాన్ని కలిగి ఉండి, ఛార్జ్ ప్లాజా నుండి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తుంటే.. టోల్ ప్లాజా ద్వారా అపరిమిత ప్రయాణానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి నెలకు రూ. 315 చొప్పున నెలవారీ పాస్ తీసుకోవచ్చు.
2022 ఆర్థిక సంవత్సరంలో.. జాతీయ రహదారులపై వసూలు చేసిన టోల్ రూ. 33,881.22 కోట్లు వసూలయ్యాయి. ఇది అంతకుముందు సంవత్సరం సేకరణ కంటే కనీసం 21 శాతం ఎక్కువ అని కేంద్ర నివేదికలు తెలుపుతున్నాయి. 2018-19 నుండి దేశంలోని జాతీయ రహదారులపై వసూలు చేసిన టోల్ మొత్తం రూ. 1,48,405.30 కోట్లతో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది.
రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకారం.. 2022లో జాతీయ, రాష్ట్ర రహదారులపై రుసుము ప్లాజాల వద్ద ఫాస్ట్ట్యాగ్ ద్వారా మొత్తం టోల్ వసూలు సగటున రోజుకు రూ. 50,855 కోట్లు లేదా రూ. 139.32 కోట్లు వసూలయ్యాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో టోల్ ఛార్జీలు పెంచడం వాహనదారులపై మరింత భారం మోపడమేనని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
