ఉత్తరప్రదేశ్‌లో ఆజాంగడ్‌ జిల్లాలోని ఓ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగడంతో ముగ్గురు మైనర్ పిల్లలు మరణించారు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంట గదిలోని ఎల్పీజీ సిలిండర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ముగ్గురు మైనర్లు మరణించారు. ఆజాంగడ్‌ జిల్లాలోని ఇమామ్‌గడ్ గ్రామంలో ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ముగ్గురు అక్కాచెల్లెళ్లు దీపాంజలి(11), శివాన్షి(6), శ్రేజల్(4)‌లు ఆదివారం సాయంత్రం వంటగదిలో ఆడుకుంటున్నారు. తల్లి అప్పుడే నీళ్ల కోసం బయటికెళ్లింది. ఇంతలోనే గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగాయి. చుట్టూ మంటలు వ్యాపించడంతో గదిలోనే చిక్కుకుపోయారు. 

ఆ చిన్నారుల ఏడుపులు, అరుపులతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్పాట్‌కు పరుగెత్తుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారి శరీరాలు చాలా భాగం కాలిపోయాయి. ముగ్గురినీ వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.

కానీ, అప్పటికే దీపాంజలి, శివాన్షి‌లు మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, శ్రేజల్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఘటన వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.