UP Assembly Election 2022: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారనీ,  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో దశ దీనిని స్పష్టం చేసిందని ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్‌పీ) చీఫ్ శివపాల్‌ సింగ్‌ యాదవ్ అన్నారు. 

UP Assembly Election 2022: ఉత్త‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఈ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ)-స‌మాజ్ వాదీ (ఎస్పీ) పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆద‌వారం నాడు రాష్ట్రంలో అత్యంత కీల‌కమైన‌, యాద‌వుల ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) ముఖ్యమంత్రి అవుతారనీ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో దశ దీనిని స్పష్టం చేసిందని ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్‌పీ) (లోహియా) చీఫ్‌ శివపాల్‌ సింగ్‌ యాదవ్ (Shivpal Singh Yadav) అన్నారు. ఇటావా జిల్లాలో ఓటు వేసిన అనంతరం యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్య‌లు చేశారు. అఖండ మెజారిటీతో సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన (Shivpal Singh Yadav) చెప్పారు. అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (PSP) ఎన్నికలలో మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్నాయి. 

ఇదిలావుండ‌గా, ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు మూడో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Assembly Election 2022) 25,794 పోలింగ్‌ కేంద్రాలు, 15,557 పోలింగ్‌ కేంద్రాల్లో 2.16 కోట్ల మంది ఓటర్లు (2.16 crore voters) తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఏడు ద‌శ‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తదుపరి దశలు ఫిబ్రవరి 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జ‌రగనుంది. మూడో ద‌శ‌లో ఎన్నికల జరిగే జిల్లాలు జాబితాలో.. హత్రాస్, ఫిరోజాబాద్, ఎటా, కస్గంజ్, మైన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరయ్యా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబా ఉన్నాయి. ఇక, నేడు మూడోదశ పోలింగ్ పూర్తయితే యూపీ అసెంబ్లీ‌లో మొత్తం 403 స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు పోలింగ్ (UP Assembly Election 2022) పూర్తయినట్టే. 

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పోటీ చేస్తున్న మెయిన్‌పురిలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి ఈ దశలోనే పోలింగ్ జరగుతుంది. ఇక, అఖిలేష్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయ‌నకు పోటీగా బీజేపీ (BJP) నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ బరి‌లోకి దిగారు. అఖి‌లేశ్‌ యాదవ్ బాబాయి శివ‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ (Shivpal Singh Yadav) పోటీ చేస్తున్న జశ్వం‌త్‌‌న‌గ‌ర్‌కు కూడా ఆదివారం పోలింగ్ జరుగుతుంది. ఇక, 2017 జరిగిన ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో.. బీజేపీ 49 స్థానాల్లో, సమాజ్‌వాద్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. అయితే, ఈ సారి పూర్తి భిన్నంగా ఫలితాలు రానున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.