బట్టలు మురికిగా ఉన్నాయని.. పదేళ్ల బాలిక దుస్తులు విప్పించి, నించోపెట్టిన టీచర్.. సస్పెన్షన్..
గిరిజన బాలిక మీద అసభ్యంగా ప్రవర్తించాడో టీచర్. మురికిగా ఉన్నాంటూ ఆమె దుస్తులు విప్పించి, నించోబెట్టాడు. ఆ దుస్తులు తానే ఉతికి ఆరేవరకు ఆమెను అలాగే ఉంచేశాడు.
మధ్యప్రదేశ్ : మురికి దుస్తులు వేసుకుని పాఠశాలకు వచ్చిందని పదేళ్ల గిరిజన బాలికలను తోటి విద్యార్థుల ముందే నిల్చోబెట్టి అవమానించిన ఉపాధ్యాయుడిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. శహడోల్ జిల్లా బారాకాల గ్రామంలోని జైసింగ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బాధిత బాలిక ఐదో తరగతి చదువుతోంది. శుక్రవారం బాలిక స్కూల్ కు వచ్చింది. అయితే, ఆమె దుస్తులు మురికిగా ఉన్నాయి. దీంతో శ్రవణ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు అభ్యంతరం తెలిపాడు. ఆ బాలిక దుస్తులను విప్పించి.. తానే స్వయంగా ఉతికాడు.
అవి ఆరిపోయేంత వరకు దాదాపు రెండు గంటల సమయం పాటు ఆమె లోదుస్తులతో నిరీక్షించాల్సి వచ్చింది. బాలిక దుస్తులు ఉతకడాన్ని స్వచ్ఛమిత్రగా అభిర్ణించుకుంటూ విద్యాశాఖకు చెందిన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ రాయ్ సిన్హా తెలిపారు.