తమిళనాడులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎరోడ్ జిల్లాకు చెందిన ఓ దినసరి కూలీ మూర్తి ఓ ఊరికి పనికి వెళ్తూ మరణించినట్టు బంధువులు ఆయన కుమారుడికి ఫోన్ చేసి చెప్పారు. కొడుకు వెంటనే అక్కడకు చేరుకుని తన తండ్రి మరణాన్ని ధ్రువీకరించారు. అనంతరం అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ, ఆ తర్వాతి రోజే తన తండ్రి మళ్లీ ఏమీ జరగనట్టు ఇంటికి తిరిగివచ్చాడు.
చెన్నై: తమిళనాడులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 55 ఏళ్ల వ్యక్తి మరో చోట ఉపాధి కోసం బయల్దేరి వెళ్లాడు. ఇంతలోనే ఆయన బస్ స్టేషన్లో విగత జీవై కనిపించాడు. ఈ విషయాన్ని ఆయన తనయుడికి తెలియజేశారు. కొడుకు పరుగున అక్కడకు చేరాడు. మరణించిన వ్యక్తి తన తండ్రేనని ధ్రువీకరించాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు ఫైల్ చేసుకుని డెడ్బాడీని ఆ కుటుంబానికి అప్పగించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, ఆ తర్వాతి రోజే మరణించాడనుకున్న వ్యక్తి మళ్లీ ప్రత్యక్షం అయ్యాడు. సరాసరి వారి ఇంటికి ఏమీ ఎరుగనట్టు వెళ్లిపోయాడు. ఇది చూసిన స్థానికులు బిత్తరపోయారు. కుటుంబ సభ్యులైతే ఖంగుతిన్నారు.
ఈ ఘటన తమిళనాడు ఎరోడ్లోని బనగలద్పూర్లో చోటుచేసుకుంది. 55 ఏళ్ల మూర్తి సమీపంలోని తిరుపూర్కు వెళ్లి చెరకు సాగు చేసేవాడు. దినసరి కూలీ అయిన మూర్తి ఆదివారం సాయంత్రం కూడా అలాగే తిరుపూర్కు వెళ్లడానికి బయల్దేరి వెళ్లిపోయాడు. కాగా, ఆదివారం ఉదయం ఆయన కొడుకు కార్తీకి బంధువుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తండ్రి మూర్తి సమీపంలోని ఓ బస్ స్టాప్లో మరణించినట్టు సమాచారం ఇచ్చారు. మూర్తి డెడ్ బాడీ అక్కడే ఉన్నట్టు తెలిపారు.
దీంతో కొడకు కార్తి ఆగమేఘాల మీద ఆ బస్ స్టాప్ చేరుకున్నాడు. ఆ డెడ్బాడీని చూసి కన్నీరుమున్నీరు అయ్యాడు. మరణించిన వ్యక్త తన తండ్రేనని ధ్రువీకరించాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు స్పాట్కు వచ్చారు. సత్యమంగళం పోలీసులు కేసు ఫైల్ చేసి ఆ మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పగించారు. వారు ఆ మృతదేహానికి అంతిమ క్రియలు నిర్వహించారు.
కాగా, సోమవారం సాయంత్రం మూర్తి ఏమీ జరగనట్టు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. సరాసరి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ కుటుంబ సభ్యులు మూర్తి నడుచుకుంటూ రావడాన్ని చూసి షాక్కు గురయ్యారు. ఆయన కొడుకు కార్తి కూడా బిత్తరపోయాడు. ఆయన ఇంటిలోకి వస్తూ ఉంటే తాము తమ కళ్లను నమ్మలేకపోయారని కార్తీ వివరించారు. తన తండ్రి మరణించాడన్న వార్త విన్నప్పుడు ఎంతలా షాక్కు గురయ్యానో.. ఆయన నడుచుకుంటూ ఇంటిలోకి రావడాన్ని చూసి కూడా అంతే షాక్కు గురయ్యానని చెప్పారు.
ఇదే విషయాన్ని ఆ తర్వాత కార్తీ పోలీసులకు తెలియజేశాడు. తన తండ్రి ఇంటికి వచ్చాడని వివరించారు. దీంతో పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. మరి అంతకు క్రితం లభించిన మృతదేహం ఎవరిదనే దర్యాప్తు మొదలుపెట్టారు. అధికారులు వెంటనే ఆ డెడ్ బాడీని ఖననం చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ డెడ్ బాడీని వెంటనే తవ్వి తీయాలని ప్రభుత్వ వైద్యు అధికారులను ఆదేశించారు. వారు డెడ్ బాడీని తవ్వి తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. స్థానిక తహశీల్దారు, రెవెన్యూ అధికారి సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.
ఇదిలా ఉండగా గతేడాది నవంబర్లో ఉత్తరప్రదేశ్లో మరణించాడని వైద్యులు ధ్రువీకరించిన మనిషే మార్చురీ నుంచి ప్రాణలతో లేచాడు. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్లో 45 ఏళ్ల ఎలక్ట్రీషియన్ శ్రీకేష్ను వేగంగా వెళ్తున్న ఓ బైక్ గురువారం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో నేలపై కూలిపోయాడు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు.
ఆయనను Hospital తీసుకెళ్లగానే మరణించాడని(Died) వైద్యులు ధ్రువీకరించడంతో ఆయన బాడీని మార్చురీ(Morgue)కి షిఫ్ట్ చేశారు. అదే రోజు రాత్రి ఫ్రీజర్లో పెట్టారు. సుమారు ఏడు గంటల తర్వాత ఉదయం పోస్టు మార్టం చేయడానికి తీయగా.. బతికే ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటన సంచలనాన్ని రేపింది. వైద్యులు కూడా ధ్రువీకరిస్తూ అతను బతికే ఉన్నాడనీ, అయితే, కోమాలో ఉన్నాడని పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తికి చికిత్స మొదలైంది. కానీ, చికిత్స పొందుతున్నప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితులు విషమించి మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన మరణించినట్టు మొరదాబాద్ జిల్లా హాస్పిటల్ అధికారులు తాజాగా వెల్లడించారు.
