భారత్ జోడో యాత్రలో మరో వివాదం.. పాస్టర్లలో రాహుల్ భేటీ.. వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కొందరు క్యాథలిక్ మత గురువులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఓ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి.
రాబోయే ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయాలని, ప్రజలతో తాను మమేకం కావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ సాగుతుంది. ప్రస్తుతం ఆ యాత్ర తమిళనాడులో కొనసాగుతోంది. అయితే.. ఈ యాత్రలో కొత్త వివాదం రాజుకుంది.
ఈ పర్యటన భాగంగా రాహుల్ శుక్రవారం కొందరు క్యాథలిక్ మతగురువులతో సమావేశమయ్యారు. ఈ పూజారుల్లో వివాదాస్పద పాస్టర్ జార్జ్ పొన్నయ్య కూడా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఆ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..?
ఈ వీడియోలో రాహుల్ గాంధీ ఓ పాస్టర్ ను 'జీసెస్ క్రైట్ (యేసు క్రీస్తు) దేవుని స్వరూపమా? ఇది నిజమా? అని అడిగారు. ఆ ప్రశ్నకు పాస్టర్ పొన్నయ్య స్పందిస్తూ, 'అవును జీసెస్ నిజమైన దేవుడనీ, శక్తి (హిందూ దేవత) లాగా కాదనీ అన్నారు. జీసెస్ ఓ మనిషిలా అవతరిస్తాడని, నిజమైన వ్యక్తిలా దర్శనమిస్తాడని, కానీ, శక్తి దేవతాలా కాదని అన్నారు. ప్రస్తుతం రాహుల్ ప్రశ్నకు, పాస్టర్ ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వీడియో క్లిప్ పై బీజేపీ స్పందిస్తూ.. ఇది బారత్ జోడో యాత్ర కాదనీ, 'భారత్ తోడో యాత్ర' అని అభివర్ణించింది. యాత్రతో విసిగిపోయిన బిజెపి చేస్తున్న దుర్మార్గమని కాంగ్రెస్ పేర్కొంది.
గతేడాది పున్నయ్య అరెస్టు
పాస్టర్ పొన్నయ్యకు గతంలోనూ ఇలాంటి వివాదాస్పద, రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన చరిత్ర ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు తదితరులపై అనుచిత పదజాలం ఉపయోగించిన ఆరోపణలపై గత ఏడాది జూలైలో మదురైలోని కలికుడి వద్ద ఆయనను అరెస్టు చేశారు. పొలియార్కురుచ్చిలోని ముట్టిదిచాన్ పారై చర్చిలో రాహుల్, పాస్టర్ పొన్నయ్య భేటీ అయ్యారు.
రాహుల్ గాంధీపై బీజేపీ దాడి
జార్జ్ పొన్నయ్య వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడిందనీ, ఇండియా జర్నీగా మారిందని పూనావాలా అన్నారు. శక్తి, ఇతర హిందూ దేవతలకు బదులు యేసు మాత్రమే దేవుడని పొన్నయ్య చెప్పారని ఆయన అన్నారు. పాస్టర్ కూడా భారతమాత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడనీ, హిందూ సంప్రదాయలను వ్యతిరేకించిన సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్ కు ఉందనీ ఆరోపించారు.
బీజేపీ వికృత చేష్టలు: జైరాం రమేష్
బీజేపీ ఆరోపణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. ఆడియోలో రికార్డయిన దానితో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర విజయవంతమైన తర్వాత బీజేపీ నిరాశకు గురైందనీ, అందకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని అన్నారు.