ఢిల్లీలో ప్రభుత్వాధికారుల నియంత్రణపై కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ పై ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వాధికారుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై సోమవారంనాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఢిల్లీలో ఉన్నతాధికారులపై కేంద్రానికే నియంత్రణ ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ నరసింహ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఆర్డినెన్స్ రాజ్యాంగబద్దతను సుప్రీంకోర్టులో ఆప్ సర్కార్ సవాల్ చేసింది. అంతేకాదు ఆర్డినెన్స్ ను రద్దు చేయడంతో పాటు మధ్యంతర స్టే విధించాలని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
ఢిల్లీలో పోలీస్, శాంతి భద్రతలు, భూమి మినహా సేవల నియంత్రణను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన వారం రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది.
