గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తారో ఎస్పీకి చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ 3 నెలల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది.  

బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బళ్లారి వెళ్లేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. పరిమిత సమయంలో స్వస్థలం బళ్లారిని సందర్శించేందుకు సుప్రీం అవకాశం కల్పించింది. అయితే ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తారో ఎస్పీకి చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. 2015 జనవరిలో గాలి జనార్థన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ ఆంక్షల్లో సుప్రీంకోర్టు స్వల్ప మార్పులు చేసింది. విచారణ త్వరగా ముగించాలని హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ 3 నెలల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది. నవంబర్‌ మూడో వారంలో లిస్ట్‌ చేయాలని కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

కాగా, తన బెయిలు షరతులను సడలించాలని, 8 వారాల పాటు బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలని గాలి జనార్దన్‌రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. జనార్దన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే, గాలి జనార్దన్‌రెడ్డి బెయిలు షరతులు సడలించవద్దని సీబీఐ.. న్యాయస్థానాన్ని కోరింది. గాలి జనార్థన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని, కేసు విచారణలో ఇబ్బందులు వస్తాయని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళ్లేందుకు అనుమతిచ్చింది.