Odisha:  ఒడిశాలోని గంజాం జిల్లాలో హింజిల్‌కట్‌ బ్లాక్‌లో ఉన్న ఓ స్కూల్లో విద్యార్థులు ‘పుష్ప’ పాటకు క్లాస్‌రూములోనే డ్యాన్స్‌ చేశారు. దాంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిని  సస్పెండ్‌ చేశారు జిల్లా అధికారులు.  

Odisha:  పుష్ప’మేనియా ఇంక త‌గ్గ‌లేదు. దేశ వ్యాప్తంగా పుష్ప రాజ్ ఎఫెక్ట్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఓస్కూల్‌లో కొంతమంది విద్యార్థులు శ్రీవల్లి పాటకు పుష్పరాజ్‌ లెవల్‌లోనే స్టెప్పులేశారు. దీంతో ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేశారు అధికారులు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని గంజాం జిల్లాలోని బారాముండలి ఉన్నత పాఠశాలలో జ‌రిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. షెరగడ బ్లాక్‌లోని బారాముండలి హైస్కూల్‌లోని 10వ తరగతి విద్యార్థులకు ప్ర‌త్యేక క్లాస్ నిర్వ‌హించారు. ఉపాధ్యాయులు హైస్కూల్ పరీక్ష స‌మ‌యంలో పాటించాల్సిన కొన్ని చిట్కాలను అందించారు. అయితే.. అంతా బాగానే ఉంది. కానీ, గదికి తాళం వేయకుండా వెళ్లిపోయారు ఉపాధ్యాయులు. దీంతో విద్యార్థులు రెచ్చిపోయారు. టీచర్లు లేని సమయంలో కొంతమంది విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌లతో టీవీని లింక్ చేసి డిజి క్లాస్‌రూమ్‌లోని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి...’ పాటకు చిందేశారు.

అంతటితో ఆగకుండా మరికొన్ని సినిమా పాటలు వేసుకుని.. తెగ చిందులు వేశారు. ఇందుకు సంబంధించిన 14 మరియు 24 సెకన్ల నిడివి గల రెండు డ్యాన్స్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ప్రధానోపాధ్యాయురాలు సుజాతపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జిల్లా విద్యాధికారులు.

ప్రధానోపాధ్యాయురాలు సుజాత పాధికి షోకాజ్ నోటీసు ఇచ్చామని, అయితే ఆమె సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేదని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ భాస్కర్ లెంక పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పాధిని బుధవారం నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బినితా సేనాపతి తెలిపారు. విచారణ కొనసాగుతోందని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మరికొంత మంది ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.