రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో.. ఇరుదేశాల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉక్రెయిన్లో ఉన్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం (Air Indias Special Flight) అక్కడికి బయలుదేరింది.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో.. ఇరుదేశాల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రష్యా - ఉక్రెయిన్ మధ్య పరిస్థితి తీవ్రంగా మారడంతో భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఉక్రెయిన్లో (Ukraine) ఉన్న భారతీయుల కోసం (Indian Nationals) తాము మూడు విమానాలను ఉక్రెయిన్కు పంపుతున్నట్లు ఎయిరిండియా యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ఈ నెలకు 22,24,26 తేదీల్లో తాము ఉక్రెయిన్కు విమానాలను పంపనున్నట్టుగా తెలిపింది.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఉక్రెయిన్లో ఉన్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం (Air Indias Special Flight) అక్కడికి బయలుదేరింది. 200 సీట్లకు పైగా సామర్థ్యం కలిగిన డ్రీమ్లైనర్ B-787 ఎయిర్క్రాఫ్ట్ ప్రత్యేక ఆపరేషన్ కోసం మోహరించినట్లు ANI వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ విమానం భారతీయులను తీసుకుని ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనుంది. ఈ విమానాలు ఉక్రెయిన్లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నాయి.. అక్కడి నుంచి భారతీయులను తీసుకుని ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి.
ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల టికెట్ల బుకింగ్ కోసం.. ఎయిరిండియా బుక్కింగ్ కార్యాలయాలు, వెబ్సైట్, కాల్ సెంటర్తో పాటు గుర్తింపు పొందిన ట్రావెల్ యాజమాన్యాలను సంప్రదించవచ్చని ఎయిరిండియా తెలిపింది. ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో 20,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు, నివసిస్తున్నారు.
ఇక, ఉక్రెయిన్లోని భారతీయులు వెంటనే వెనక్కి రావాలని కేంద్రం కోరింది. అత్యవసరమైతే తప్ప అక్కడ ఉండొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులతో పాటు కీవ్లోని రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబసభ్యులు కూడా ఉక్రెయిన్ విడిచి రావాలని పేర్కొంది. విమానాల షెడ్యూళ్లు, ఇతర సమాచారం కోసం విద్యార్థులు.. తమ కౌన్సిలర్లను సంప్రదించాలని, రాయబార కార్యాలయం వెబ్సైట్ను, ఫేస్బుక్, ట్విటర్ ఖాతాలను అనుసరించాలని ప్రకటనలో పేర్కొంది.
