నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల (1971-2020 కాలం) సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది.
నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల (1971-2020 కాలం) సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది. భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలు, మధ్య భారతదేశం, హిమాలయ పర్వత ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలో, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి రుతుపవనాల సీజన్లో భారతదేశం 1971-2020 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 868.6 మి.మీ ఉంది. అంతకు ముందు 1961-2010 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 880.6 మి.మీగా ఉందని ఐఎండీ తెలిపింది.
ఇక, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలను నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. గతేడాది నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో సాధారణ వర్షపాతం నమోదైంది. 2019, 2020లలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో దేశంలో వరుసగా మూడో ఏడాది సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా అయింది.