ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి శవాలు: బ్లాంకెట్ లో చుట్టి....
ఒడిశాలోని బొలంగర్ జిల్లాలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఓ గ్రామంలో ఓ ఇంటిలో ఆరుగురి శవాలు బ్లాంకెట్ లో చుట్టి కింద పడి ఉన్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భువనేశ్వర్: ఒడిశాలోని బలంగీర్ జిల్లా పట్నగడ్ లో గల సొంవొరొపొడా గ్రామంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యుల శవాలు అనుమానాస్పద పరిస్థితిలో కనిపించాయి. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇంటిలోని ఓ గదిలో బ్లాంకెట్ లో చుట్టి నేల మీద మృతదేహాలు ఉండడం పట్నగడ్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ ప్రియాంక రౌత్రాయ్ గాలింపులో గమనించారు.
మృతులను గ్రామానికి చెందిన బుల్లు జానీ, ఆయన భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు భీష్మ, సంజీవ్ లుగా, ఇద్దరు కూతుళ్లు సరిత, శ్రేయలుగా గుర్తించారు. దాదాపు 10 ఏళ్లుగా బుల్లు జానీ తేనె సేకరించి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ సభ్యుల అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసుుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎవరైనా వారిని హత్య చేశారా, వారే ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. మృతదేహాల పక్కన ఓ గొడ్డలి పడి ఉంది. దీంతో వారిని హత్య చేసి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
జైనీ ఇంటికి చాలా రోజులుగా తాళం వేసి ఉండడంతో ఏదో జరిగిందనే అనుమానంతో కిటికీల నుంచి తొంగి చూశారు. వారు గదిలో ఆరు శవాలు పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.