ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోవడంతో చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు.

ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోవడంతో చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 21 మందికి గాయాలు అయ్యాయి. లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో నాగ్లా ఖన్గర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, డీసీఎంను ఢీకొట్టిన అనంతరం బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడినట్టుగా తెలుస్తోంది.
‘‘లూథియానా నుంచి రాయ్బరేలీకి వెళుతున్న ప్రయాణీకుల బస్సు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. స్థానిక పోలీసుల బృందం సహాయక చర్యలు చేపట్టేందుకు సంఘటనా స్థలానికి చేరుకుంది’’ అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) రణవిజయ్ సింగ్ తెలిపారు.
‘‘ప్రమాదంలో ఒక మహిళ, ఒక బిడ్డతో సహా బస్సులోని ఆరుగురు ప్రయాణికులు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు’’ అని రణవిజయ్ సింగ్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని.. మృతుల వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.