సిద్దూ మూసేవాలా హత్యలో కీలక ఆధారాలు లభించాయి. సిద్ధూ మూసేవాలాను హతమారుస్తుండగా ఉపయోగించిన వాహనంలో పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. అందులో పెట్రోల్ పంప్లో ఇంధనం కొట్టించుకున్న రశీదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ రశీదుతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నలుగురు షూటర్లను గుర్తించింది.
న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తు పురోగతి సాధించింది. ఈ కేసులో నలుగురు షూటర్లను గుర్తించడానికి పెట్రోల్ పంప్ రశీదు కీలకంగా మారాయి. సిద్దూ మూసేవాలా హత్యకు ఉపయోగించిన కారులో లభించిన క్లూలో ఫ్యూయల్ రిసీట్ ఒకటి. ఈ రశీదు ద్వారా సిద్దూ మూసేవాలాను హతమార్చిన నలుగురు షూటర్లను పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది.
ఖరార్ ఆఫీసులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లారెన్స్ బిష్ణోయ్ను గంటలపాటు విచారిస్తూనే ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ నుంచి కట్టుదిట్టమైన భద్రతతో ఆయనను బుధవారం ఖరార్కు తెచ్చినట్టు తెలిసింది. ఆయన తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం లేదని సిట్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, సిద్దూ మూసేవాలాను హతమార్చడానికి ఉపయోగించిన వాహనంలో పంజాబ్ పోలీసులు కొన్ని ఆధారాలు దొరకబట్టారు. 2022 మే 25వ తేదీతో ఫతేబాద్కు చెందిన ఓ పెట్రోల్ పంప్ రశీదు కాల్పులకు దుండగులు ఉపయోగించిన బొలెరో కారులో దొరికింది. వెంటనే ఆ రోజుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కలెక్ట్ చేసి ఆ వెహికిల్ను ట్రాక్ చేయడానికి ఓ పోలీసు బృందం వెళ్లింది. ఈ ఫుటేజీ సహాయంతో ఓ షూటర్ను దాదాపుగా గుర్తించారు. ఆ షూటర్ను సోనిపాట్కు చెందిన ప్రియవరాత్గా గుర్తించారు. ఆ వెహికిల్ వెళ్లిన దారిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ట్రాక్ చేస్తే.. ఆ బొలేరోను కాల్పులు జరిపిన తర్వాత స్పాట్కు 13 కిలోమీటర్ల దూరంలో వదిలేసినట్టు తేలింది.
నిందితులు వాడిని మహింద్రా బొలేరో, టయోట కరోలా, వైట్ ఆల్టో కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టయోటా కరోలా పక్కన పెట్టేసి అటుగా వస్తున్న ఆల్టో కార్ను గన్ చూపించి బెదిరించి పట్టుకెళ్లారు.ఆ తర్వాత ఖారా బర్నాలా గ్రామం వైపు వెళ్లిపోయారు. మోగా జిల్లాలోని ధరమ్కోట్ దగ్గర మే 30న ఆ కారును వదిలి పెట్టారు.
పోలీసు వర్గాల ప్రకారం, ఆ నలుగురు షూటర్లను సోనిపాట్కు చెందిన ప్రియవరాత్, అంకిత్, మోగాకు చెందిన మాను కుసా, అమృత్సర్కు చెందిన జగ్రూప్ రూపాగా గుర్తించారు. అయితే, వీరిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్తోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా షూటర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినవారిగా అనుమానిస్తున్నారు.