బీహార్ ఎన్నికలు: కంగనాతో బీజేపీ వ్యూహం.. సంజయ్ రౌత్ సంచలనం
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విషయంలో సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు కురిపించారు. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా, బీఎంసీని బాబర్ సైన్యంతో పోల్చిన వారికి మహారాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం కొమ్ముకాయడం దురదృష్టకరమని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో సంజయ్ మండిపడ్డారు
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విషయంలో సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు కురిపించారు. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా, బీఎంసీని బాబర్ సైన్యంతో పోల్చిన వారికి మహారాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం కొమ్ముకాయడం దురదృష్టకరమని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో సంజయ్ మండిపడ్డారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కంగనాకు బీజేపీ మద్ధతివ్వాలని నిర్ణయించిందని వ్యాఖ్యానించారు. బీహార్లోని అగ్రవర్ణ రాజ్పుత్, క్షత్రియ ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే కాషాయ పార్టీ ఈ ప్రయత్నం చేస్తోందని రౌత్ దుయ్యబట్టారు.
మహారాష్ట్రను అవమానపరిచిన వారికి మద్ధతిస్తూ బీహార్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. జాతీయవాదులుగా చెప్పుకునే వారికి ఇది తగదని, మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నా మహారాష్ట్ర బీజేపీ నేతలెవరూ నోరు మెదపడం లేదని సంజయ్ ప్రశ్నించారు.
Also Read:నా మౌనాన్ని బలహీనతగా చూడొద్దు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగంగా ఇలా జరుగుతోందని.. మహారాష్ట్రలో మరాఠాలంతా ఏకమవ్వాల్సిన సంక్షిష్ట సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలను ఓ సినీ నటి అవమానిస్తుంటే బీజేపీ నేతలు స్పందించడం లేదని, ఇది ఎలాంటి స్వేచ్ఛకు ప్రతీకని సంజయ్ ప్రశ్నించారు.
చివరికి బాలీవుడ్ నటులు కూడా మాట్లాడటం దురదృష్టకరమని రౌత్ దుయ్యబట్టారు. కంగనా రనౌత్ అభిప్రాయాలు సినీ పరిశ్రమ అభిప్రాయాలు కాదన్న విషయాన్ని బాలీవుడ్ ప్రతినిధులు స్పష్టం చేయాలని సంజయ్ కోరారు.
కనీసం అక్షయ్ కుమార్ అయినా దీనిపై స్పందించాలని... ముంబై పట్ల కృతజ్ఞత చూపేందుకు కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చురకలంటించారు.