కాంట్రాక్టర్పై చెత్త వేయించాడు:శివసేన ఎమ్మెల్యే ఓవరాక్షన్
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే తీరు వివాదాస్పదంగా మారింది. పారిశుద్య కాంట్రాక్టర్ ను రోడ్డుపై కూర్చోబెట్టి చెత్తను ఆయనపై వేయించారు.
ముంబై:మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే తీరు వివాదాస్పదంగా మారింది. పారిశుద్య కాంట్రాక్టర్ ను రోడ్డుపై కూర్చోబెట్టి చెత్తను ఆయనపై వేయించారు. నైరుతి రుతుపవనాల కారణంగా ముంబైలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది.
మురుగు నీరు రోడ్లపై ప్రవహించడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు. మురుగునీటిలో కాంట్రాక్టర్ను కూర్చోబెట్టి పారిశుద్య కార్మికులతో అతడిపై చెత్త వేయించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 15 రోజులుగా రహదారిని క్లియర్ చేయాలని తాను కాంట్రాక్టర్ ను అభ్యర్ధించినట్టుగా ఎమ్మెల్యే చెప్పారు. కానీ తన మాటను కాంట్రాక్టర్ వినలేదని ఆయన చెప్పారు. కానీ ఈ పనిని తమ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారన్నారు. ఈ విషయం తెలిసి కాంట్రాక్టర్ ఇక్కడికి వచ్చాడని ఆయన తెలిపారు. దాదాపుగా 25 ఏళ్లుగా బీఎంసీని శివసేన శాసిస్తోంది. రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ సంకీర్ణ సర్కార్ కొనసాగుతోంది.