మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు చేరడంపై ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఇది గూగ్లీ కాదని.. దోపిడీ అని పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు చేరడంపై ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఇది గూగ్లీ కాదని.. దోపిడీ అని పేర్కొన్నారు. ఎన్సీపీ మొత్తం తనకు అండగా నిలుస్తోందని అజిత్ పవార్‌ చెప్పడంపై స్పందిస్తూ.. త్వరలోనే నిజం బయటపడుతుందని అన్నారు. ‘‘రెండు రోజుల క్రితం ఎన్సీపీ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఎన్సీపీపై ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తావించారని అన్నారు. ఇప్పుడు ఎన్సీపీలో తన సహచరులు కొందరు మంత్రులుగా ప్రమాణం చేసినందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. తద్వారా (ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం) ఆరోపణలన్నీ క్లియర్ అయినట్లు స్పష్టమవుతోందని అన్నారు. 

జూలై 6వ తేదీన సమావేశానికి రావాల్సిందిగా తాను నాయకులందరినీ పిలిచానని శరద్ పవార్ చెప్పారు. ఆ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించి.. పార్టీలో కొన్ని మార్పులు చేయాలని భావించామని తెలిపారు. అయితే ఆ సమావేశం జరగకముందే.. కొందరు పార్టీ సహచరులు భిన్నమైన వైఖరి తీసుకున్నారని అన్నారు. అయితే ఇదేమి కొత్త విషయం కాదని.. 1980లో తాను నాయకత్వం వహించిన పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. అయితే అందరూ వెళ్లిపోయాక, 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని చెప్పారు. కానీ తాను ఆ సంఖ్యను బలపరిచానని.. తనను విడిచిపెట్టిన వారు వారి నియోజకవర్గాల్లో ఓడిపోయారని తెలిపారు. 


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరుల నుంచి తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని శరద్ పవార్ చెప్పారు. ఈరోజు ఏమి జరిగినా తాను చింతించనని అన్నారు. తాను రేపు వైబీ చవాన్ ఆశీస్సులు తీసుకుంటానని.. తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత ఎవరనే దానిపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్‌కు ఉందని అన్నారు. రాబోయే రెండు-మూడు రోజుల్లో పరిస్థితిని సమీక్షించడానికి తాము కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి కూర్చుని చర్చించనున్నట్టుగా చెప్పారు. తమను ఎన్నుకునే సామాన్య ప్రజలే తమ బలం అని పేర్కొన్నారు. 


మళ్లీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని శరద్ పవార్ అన్నారు. తిరుగుబాటు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలను కొన్ని బాధ్యతలను అప్పగించానని.. కానీ వారు వారి బాధ్యతలను పాటించలేదని.. అందుకే వారిపై కొన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. తన ఇల్లు విడిపోయిందని తాను ఎప్పుడూ చెప్పనని అన్నారు. ఇది ప్రజల సమస్య అని.. వెళ్లిపోయిన వారి భవిష్యత్తు గురించి తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు.

ఇందుకు సంబంధించిన క్రెడిట్‌ని ప్రధాని మోదీకి అందించాలనుకుంటున్నానని సెటైర్లు వేశారు. రెండు రోజుల క్రితం.. మోదీ చేసిన ప్రకటన తరువాత కొంతమందికి అసౌకర్యం మొదలైందని అన్నారు. వారిలో కొందరు ఈడీ చర్యలను కూడా ఎదుర్కొంటున్నారని అన్నారు.