మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇండోర్‌లోని ఆలయంలో 25 మంది భక్తులు మెట్ల బావిలో పడిపోయారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇండోర్‌లోని శ్రీ బెళేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలిపోవడంతో  కొంతమంది భక్తులు అందులో పడిపోయారు. దాదాపు 25 మంది భక్తులు మెట్లబావిలో పడిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బావిలో పడినవారిని రక్షించేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బావిలో పడిపోయినవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు  తెలిపారు. 

అయితే శ్రీరామ నవమి  సందర్భంగా ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని.. పురాత బావి పైకప్పుపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని.. అది భారం తట్టుకోలేక కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆలయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడున్నవారు తాడులతో మెట్ల బావి లోపల పడిపోయినవారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.