చంద్రాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో బస్సును, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో బస్సును, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రాపూర్ జిల్లా కేంద్రానికి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలోని నాగ్భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
‘‘నాగ్పూర్ నుంచి నాగ్భిడ్కు కారులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా.. వారి వాహనం ఎదురుగా వస్తున్న ప్రయాణీకుల బస్సును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఒక మహిళ, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను, చిన్నారి తొలుత నాగ్భిడ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసు అధికారి చెప్పారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహిళా మృతిచెందగా.. బాలికను తదుపరి చికిత్స నిమిత్తం నాగ్పూర్కు తరలించామని తెలిపారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం.